హైదరాబాద్లో 6.6లక్షల కేసులపై సిసిఎంబీ…
తమ పరిశోధనలో కరోనా వైరస్ ఆనవాళ్లు మురుగునీటి ద్వారా లభ్యమైన నేపధ్యంలో ఆ నీటిలో వైరస్ ఆనవాళ్లున్నా భయపడాల్సిన అవసరం లేదని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) డైరెక్టర్ రాకేష్ శర్మ చెప్పారు. హైదరాబాద్లో తాము నిర్వహించిన పరిశోధన ఫలితాల ద్వారా 6.60లక్షల మందికి కరోనా సోకినట్టు సిసిఎంబి బుధవారం వెల్లడించిన సంగతి తేలిందే. ఈ నేపధ్యంలో ఆయన గురువారం మాట్లాడుతూ కరోనా వైరస్ సోకినప్పటికీ లక్షణాలు లేకుండానే చాలా మంది ఉంటున్నారన్నారు. అయితే లక్షణాలు లేనప్పుడు పాజిటివ్గా నిర్ధారణ అయినా భయపడాల్సిన పరిస్థితి లేదన్నారు. ఆసుపత్రుల్లో చేరి వైద్య చికిత్స కోసం పరుగులు తీయాల్సిన అవసరమూ లేదన్నారు. ఈ విషయంలో తమ పరిశోధనలు ఇంకా కొనసాగుతాయన్నారు.
సిసిఎంబీ పరిశోధన వివరాలివీ…
గత 35 రోజుల్లో ఏకంగా 6.6 లక్షల మంది నగరవాసులు ఈ మహమ్మారి బారినపడ్డారని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ), సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) సంస్థలు జరిపిన సంయుక్త అధ్యయనంలో వెల్లడైంది. మురుగునీటి నమూనాలపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెలుగు చూసింది. లక్షణాలు లేకపోవడంతో చాలామందికి తమకు వైరస్ వచ్చి వెళ్లిన విషయం కూడా తెలియకుండా పోయిందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
కరోనా బారినపడిన వారి ముక్కునుంచి కారే స్రావాలు, నోటి తుంపర్ల నుంచే కాకుండా మలమూత్ర విసర్జన ద్వారా కూడా వైరస్ బహిర్గతమవుతుంది. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తి తీరును తెలుసుకునేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఐఐసీటీ, సీసీఎంబీలు మురుగునీటిపై పరీక్షలు చేపట్టాయి. హైదరాబాద్ వ్యాప్తంగా రోజూ 1800 మిలియన్ లీటర్ల మురుగునీరు వస్తుండగా, 760 మిలియన్ లీటర్లు అంటే 40 శాతం నీటిని మాత్రమే మురుగునీటి శుద్ధి కేంద్రాలలో శుద్ధి చేస్తున్నారు. వీటిలో 80 శాతం కేంద్రాల వద్ద 35 నమూనాలను సేకరించి సీసీఎంబీలో పరీక్షించారు.
నిజానికి కరోనా వైరస్ సోకి తగ్గిపోయినా 35 రోజుల వరకు వైరస్ పదార్థాలు బాధితుల మలమూత్రాల నుంచి విడుదలవుతుంటాయి. ప్రతి ఇంట్లోంచి ఎంత మురుగునీరు విడుదలవుతోందన్న గణాంకాల ఆధారంగా ఎంతమందికి కరోనా వచ్చి తగ్గి ఉంటుందనే అంచనాలను శాస్త్రవేత్తలు రూపొందించారు. దీని ప్రకారం నగరంలో 2 లక్షల మంది విసర్జితాల్లో వైరస్ విడుదలైనట్టు గుర్తించిన పరిశోధకులు, శుద్ధి చేయని 60 శాతం మురుగును కూడా కలిపితే మొత్తం 6.6 లక్షల మందికి గత 35 రోజుల్లో కరోనా సోకి తగ్గినట్టు ఓ అంచనాకొచ్చారు.






