ఇండో గల్ఫ్ త్రోబాల్ టోర్నమెంట్ విజేత అమెరికా టీమ్
బహ్రెయిన్లో ఫిబ్రవరి 23వ తేదీన జరిగిన ఇండో గల్ఫ్ 2024 త్రోబాల్ ఛాంపియన్ షిప్ లో అమెరికా మహిళా టీమ్ స్పోర్టి దివస్ జట్టు విజేతగా నిలిచింది. ఈ ఇంటర్నేషనల్ త్రోబాల్ ఛాంపియన్ షిప్ ను ఇంటర్నేషనల్ త్రోబాల్ ఫెడరేషన్తో కలిసి ది ఇండియన్ క్లబ్ నిర్వహించింది. ఈ టోర్నమెంట్లో 7 టీమ్లు పాల్గొన్నాయి. బహ్రెయిన్ నుంచి 4 టీమ్లు, అమెరికా, ఇండియా, సౌదీ నుంచి ఒక్కొక్క టీమ్ పాల్గొంది. సెమిఫైనల్ పోటీల్లో సౌదీతో తలపడి విజేతగా నిలిచి, ఫైనల్లో ఇండియా టీమ్తో పోటీపడి విజేతగా అమెరికా మహిళా టీమ్ నిలిచింది. ఫైనల్ పోటీల్లో విజయం సాధించడంతో యుఎస్ఎ స్పోర్టి దివస్ టీమ్ను టోర్నమెంట్ విజేతగా ప్రకటించారు. వసంత కావూరి, కావ్య వుర్రాకుల, నిత్య సౌందరరాజన్, షబ్నం సంసుద్దీన్, సాయి లక్ష్మి గార్లపాటి, సృజన కుంచి, గౌతమి యలవర్తి ఈ టీమ్లో ఉన్నారు.
తానా సెక్రటరీ రాజా కసుకుర్తి, తానా స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ నాగ పంచుమర్తి, తానా ఇంటర్నేషనల్ కో ఆర్డినేటర్ ఠాగూర్ మల్లినేని ఈ టీమ్ను స్పాన్సర్ చేసిన సంగతి తెలిసిందే. విజేతగా నిలిచిన తరువాత టీమ్ సభ్యులు తమను స్పాన్సర్ చేసిన తానా నాయకులకు ప్రోత్సహించిన కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు.







