TANA: తానా గోరింటాకు పండుగ విజయవంతం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) ఆధ్వర్యంలో వర్జీనియా (Virginia) లో ‘‘ఆడపడుచుల గోరింటాకు పండుగ’’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని తానా ప్రత్యేకంగా ఈ వేడుకను నిర్వహించింది. ఈ వేడుకలకు మహిళలతోపాటు పలువురు ప్రముఖులు, తానా నాయకులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా తానా సాంస్కృతిక విభాగం కో ఆర్డినేటర్ సాయిసుధా పాలడుగు మాట్లాడుతూ, ఏ దేశంలో ఉన్నా మన సంస్కృతి, సంప్రదాయాల్ని కాపాడుకోవడంలో తెలుగు మహిళలు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని తెలియజేశారు. అమెరికాలో తెలుగు వారి జీవన విధానం, సంస్కారం, పండుగల్ని భావితరాలకు తెలియజేయడం కోసం.. భాష కట్టుబొట్టుల్ని కాపాడడం కోసం తానా ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆమె తెలిపారు. తానా సాంస్కృతిక విభాగం కో-ఆర్డినేటర్ సాయిసుధా పాలడుగు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తానా అధ్యక్షుడు నరేన్ కొడాలి, ఈనాడు తెలంగాణ ఎడిటర్ డీఎన్ ప్రసాద్, గుంటూరు మిర్చి యార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో స్థానిక తెలుగు మహిళలు హాజరై గోరింటాకు పెట్టుకొని సందడి చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతుల్ని అలరించాయి. తెలుగు సంస్కృతీ సంప్రదాయాలకు అద్దంపట్టాయి. ఏ దేశంలో ఉన్నా మన సంస్కృతి, సంప్రదాయాల్ని కాపాడుకోవడంలో తెలుగు మహిళలు ప్రధాన పాత్ర పోషిస్తారని సాయిసుధా పాలడుగు అన్నారు. అమెరికాలో తెలుగువారి జీవన విధానం, భాషా సంస్కృతులు, సంస్కారం, పండుగల్ని కాపాడుకోవడంతో పాటు భావితరాలకు తెలియజేసేందుకు తానా ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఆమె తెలిపారు.
అధ్యక్షుడు నరేన్ కొడాలి మాట్లాడుతూ ‘ఐదు దశాబ్దాల తానా సుదీర్ఘ ప్రయాణంలో అనేక ఎత్తుపల్లాలు, మరెన్నో ఆటుపోట్లు తట్టుకుని సగర్వంగా నిలబడి తన ఉనికిని చాటుకుంది. భవిష్యత్తులో 50 వసంతాలకు చేరుకోనున్న సందర్భంగా ‘‘న భూతో న భవిష్యతి’’ అన్న రీతిలో తెలుగు ప్రజల కీర్తి దశదిశలా వ్యాప్తి చేసేలా వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తాం. ప్రవాసాంధ్రులు వీటిలో భాగస్వాములై విజయవంతం చేయాలి’’ అని ఆయన పిలుపునిచ్చారు.
అమెరికాలోని తెలుగుదనాన్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చి అమ్మ భాషకు, తెలుగుజాతికి గుర్తింపు, గౌరవాన్ని ‘తానా’ తీసుకొచ్చిందని మన్నవ సుబ్బారావు కొనియాడారు. ఒక జాతి అస్థిత్వాన్ని, ప్రత్యేకతను చాటిచెప్పేది మాతృభాషేనన్నారు. ‘మాతృభాషను విస్మరించిన ఏ జాతీ మనుగడ సాగించలేదు. అనేక జాతులు మాతృభాషను విస్మరించి కాలగర్భంలో కలిసిపోయాయి. ఇది చరిత్ర చెప్పే సత్యం. భాష సాంస్కృతిక వారధి. అందుకే మాతృభాష మృతభాష కాకూడదని ఇక్కడి ప్రవాసాంధ్రులు చేస్తున్న కృషి అభినందనీయం’ అన్నారు.
ఈ కార్యక్రమంలో సుధీర్ కొమ్మి, జానీ నిమ్మలపూడి, రాజేష్ కాసరనేని, అనిత మన్నవ, శ్రీవిద్య సోమ, అనిల్ ఉప్పలపాటి, రవి అడుసుమిల్లి, భాను మాగులూరి, శాంతి పారుపల్లి, కవిత చల్లా, త్రిలోక్ కంతేటి, సాయి బొల్లినేని, సత్య సూరపునేని, ఉమాకాంత్ తదితరులు పాల్గొన్నారు.







