ఉత్తర కొరియాతో కయ్యం తప్పేటట్టు లేదు
ఉత్తర కొరియాతో పెను సమస్య తప్పేటట్టు లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. నిజానికి ఉత్తర కొరియా సమస్యను దౌత్య పరంగా పరిష్కరించాలన్న ఉద్దేశం ఉన్నా, అలాంటి పరిస్థితి ఉత్పన్నమయ్యే అవకాశాలు కనిపించడం లేదని అన్నారు. నార్త్ కొరియా ఇటీవల పదేపదే అణుపరీక్షలు నిర్వహిస్తున్నది. అంతేకాదు మిస్సైల్ పరీక్షలతోనూ ఆసియా దేశాల్లో టెన్షన్ పుట్టిస్తున్నది. ఈ నేపథ్యంలో అమెరికా యుద్దనౌకలు తాజాగా కొరియా ద్వీపకల్పానికి చేరుకున్నారు. జలాంతర్గాములు, విమాన వాహక నౌకలు, థాడ్ మిస్సైళ్లు దక్షిణ కొరియా చేరాయి. ఈ సందర్భంగా అక్కడ ఉన్న ఉద్రిక్త పరిస్థితిని వివరిస్తూ ట్రంప్ ఈ వార్నింగ్ చేశారు. నార్త్ కొరియా మరోసారి అణు పరీక్షలు నిర్వహించకుండా ఉండేందుకు తమ ప్రభుత్వం వీలైనన్ని ప్రయత్నాలు చేసిందని అన్నారు. అందుకే ఈ వార్నింగ్ తప్పడం లేదన్నారు. అయితే నార్త్ కొరియా దూకుడును తగ్గించేందుకు చైనా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. చైనా అధ్యక్షుడు జీ జింగ్పింగ్ ఈ అంశంలో వీలైనన్ని వ్యూహాలు రచిస్తున్నట్లు చెప్పారు. నార్త్ కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ దూకుడును ఆపేందుకు చైనా ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలిపారు. కొరియాలో రక్తపాతాన్ని చూడాలన్న కాంక్ష జీ జింగ్పింగ్కు లేదనుకుంటానని, అతను మంచి వ్యక్తి అని, తన దేశాన్ని ప్రేమిస్తాడని అన్నారు.













