మే నెలలోనే రూ.750 కోట్లు నష్టపోయిన అమెరికా!

ఓ అమెరికా ఎంక్యూ-9 రీపర్ డ్రోన్ ధర 30 మిలియన్ డాలర్లు. భారత కరెన్సీలో దాదాపు రూ.250 కోట్లు. అంత విలువైన అమెరికా డ్రోన్లను యెమెన్లోని హూతీ తిరుగుబాటుదారులు వరుసగా పడగొడుతున్నారు. బుధవారం మరో రీపర్ కూలినట్లు అమెరికా సైనిక వర్గాలు ధ్రువీకరించాయి. ఈ నెలలో ఇలా కూలిన మూడో డ్రోన్ ఇది. అంటే దాదాపు రూ.750 కోట్లు అగ్రరాజ్యం నష్టపోయింది. యెమెన్లోని సెంట్రల్ మారిబ్ ప్రావిన్స్లోని ఎడారిలో డ్రోన్ పడిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. ఈ డ్రోన్ విషయంలో హూతీ తిరుగుబాటుదారులు అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. పాలస్తీనియన్లకు మద్దతుగా ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై హూతీలు గత కొన్ని నెలలుగా దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో తిరుగుబాటుదారుల ఆక్రమణలో ఉన్న యెమెన్ భూభాగంలో అమెరికా వైమానిక, డ్రోన్లతో దాడులు చేస్తోంది. ఇందులో ఎంక్యూ-9 రీపర్లు కూడా పాలుపంచుకుంటున్నాయి.