కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి అరుదైన గౌరవం.. ప్రపంచంలోనే
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు మరోసారి అరుదైన గౌరవం దక్కింది. 2023 ఏడాదికి ఫోర్బ్స్ విడుదల చేసిన ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన 100 మంది మహిళల జాబితాలో ఆమెకు వరుసగా ఐదోసారి చోటు లభించింది. భారత్ నుంచి మొత్తం నలుగురు మహిళలకు చోటు దక్కగా, వారిలో నిర్మలా సీతారామన్ తొలి స్థానంలో నిలిచారు. ప్రపంచవ్యాప్త జాబితాలో ఆమె 32వ స్థానంలో ఉన్నారు. గతేడాది 36వ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. నిర్మలా సీతారామన్ తర్వాత భారత్ నుంచి హెచ్సీఎల్ కార్పొరేషన్ చైర్పర్సన్ రోష్నీ నాడర్ మల్హోత్రా, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ సోమా మోండల్, బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజూందర్ షా లకు వరుసగా ఈ ఏడాది జాబితాలో చోటు దక్కింది.
ఈ జాబితాలో యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాన్ దెర్ లెయెన్ తొలి స్థానంలో నిలిచారు. రెండో స్థానంలో యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అధిపతి క్రిస్టినా లగార్డ్, మూడో స్థానంలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఉన్నారు. నాలుగో స్థానంలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, ఐదు స్థానంలో అమెరికా గాయని టేలర్ స్విప్ట్ చోటు దక్కించుకున్నారు.






