73 మందికి క్షమాభిక్ష పెట్టిన డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవీకాలం నేటితో ముగియనున్నది. తన పదవి చివరి రోజున భారీ ఔదార్యం ప్రదర్శించారు. ఒకేసారి 73 మందికి ఆయన క్షమాభిక్ష ప్రసాదించారు. ట్రంప్ వద్ద పనిచేసిన మాజీ అడ్వైజర్ స్టీవ్ బానన్ కూడా ఆ జాబితాలో ఉన్నారు. మరికొన్ని గంటల్లో 46వ దేశాధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. తన ప్రభుత్వ చివరి రోజుల్లో ట్రంప్ మొత్తం 140 మందికి క్షమాభిక్ష పెట్టారు. ర్యాపర్ లిల్ వెయినీ, కొడాక్ బ్లాక్, డెట్రాయిట్ మేయర్ క్వామీ కిల్ప్యాట్రిక్లు కూడా ప్రాణభిక్ష పొందినవారిలో ఉన్నారు. 73 మందికి క్షమాభిక్ష ప్రసాదించిన అంశాన్ని శ్వేతసౌధం ఓ ప్రకటనలో పేర్కొన్నది. మరో 70 మందికి శిక్షను తగ్గించినట్లు వైట్హౌజ్ పేర్కొన్నది.
2016 ఎన్నికల వేళ స్టీవ్ బానన్ ట్రంప్ వ్యూహాకర్తగా వ్యవహరించారు. అయితే గత ఏడాది ఆగస్టులో ఆయన్ను అరెస్టు చేశారు. మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణం కోసం జరిగిన నిధుల సేకరణలో స్టీవ్ బానన్ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. వందల సంఖ్యలో విరాళాలు ఇచ్చేవారిని తప్పుదోవ పట్టించినట్లు బానన్పై కేసు నమోదు అయ్యింది. వీ బిల్డ్ ద వాల్ క్యాంపేన్ ద్వారా సుమారు 25 మిలియన్ల డాలర్లు సేకరించారు. దాంట్లో దాదాపు మిలియన్ డాలర్లు.. బానన్ నొక్కేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ర్యాపర్ వెయిన్, కొడాక్పై ఆయుధాల ఆరోపణలు ఉన్నాయి. అయితే వైట్హౌజ్ను వీడి వెళ్తున్న అధ్యక్షులు.. క్షమాభిక్షను ప్రసాదించడం సర్వసాధరణమే.






