విదేశీ ప్రయాణికులపై నిషేధాన్ని పునరుద్ధరించనున్న జో బైడెన్ ప్రభుత్వం
కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా జో బైడెన్ ప్రభుత్వం విదేశీ ప్రయాణికుల రాకపోకలపై నిషేధాన్ని తిరిగి పునరుద్ధరించనున్నట్లు వైట్హౌస్ ప్రతినిధి ఒకరు తెలిపారు. బ్రిటన్, బ్రెజిల్, ఐర్లాండ్, ఐరోపాలకు చెందిన ప్రయాణికులపై ఈ నిషేధం కొనసాగనుందని అన్నారు. కరోనా వైరస్ కొత్త వేరియంట్లు అమెరికాలో కూడా వెలుగుచూస్తున్నాయన్న హెచ్చరికల నేపథ్యంలో.. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ప్రయాణికులపై కూడా నిషేధాన్ని పొడిగించనున్నట్లు ఆ అధికారి మీడియాకు తెలిపారు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా ప్రజలంతా వందరోజుల పాటు మాస్క్ ధరించాల్సిందేనంటూ గత వారం ప్రమాణ స్వీకారం అనంతరం అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
అమెరికా విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికులు క్వారంటైన్ నిబంధనలను పాటించాల్సిందేనని ఆదేశించారు.. దేశంలో కరోనా మరణాల సంఖ్య వచ్చే నెలకు సుమారు ఐదు లక్షలకు చేరుకునే అవకాశం ఉందని, దీంతో కఠిన చర్యలు తప్పనిసరని బైడెన్ తెలిపారు. ప్రస్తుతం మనం జాతీయ అత్యవసర పరిస్థితిలో ఉన్నామని, దీంతో కఠినంగా వ్యవహరించాల్సిన సమయమిదని అన్నారు. కాగా, ట్రంప్ అధ్యక్షునిగా కొనసాగిన చివరిరోజులలో యూరప్, బ్రెజిల్ నుంచి వచ్చిన ప్రయాణికులపై నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు జారీ చేసిన ఉత్తర్వులను కూడా వెంటనే రద్దు చేయనున్నట్లు వైట్హౌస్ సృష్టం చేసింది.






