SDRF: ఎస్డీఆర్ఎఫ్ ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం (ఎస్డీఆర్ఎఫ్)ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రారంభించారు. అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో దాదాపు 2 వేల మంది సిబ్బందితో ఏర్పాటైన ఎస్డీఆర్ఎఫ్ భారీ అగ్ని ప్రమాదాలు, భూకంపం, వరదలు వంటి విపత్తులు సంభవించినప్పుడు అత్యవసరంగా సహాయక చర్యలు చేపట్టనుంది. అగ్నిమాపక కేంద్రాలు ఇక నుంచి ఎస్డీఆర్ఎఫ్ (SDRF) స్టేషన్లుగా మార్పు చెందనున్నాయి.
జులై, ఆగస్టు నెలల్లో సంభవించిన వరదలకు పలు ప్రాంతాలు నీటమునిగిన క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అత్య్యవసర సమీక్ష నిర్వహించారు. ఎన్డీఆర్ఎఫ్ (NDRF) తరహాలో సుశిక్షుతులైన దళం అవసరమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఎస్డీఆర్ఎఫ్ను తీర్చిదిద్దడంతో పాటు ఆధునికీకరించేందుకు ప్రభుత్వం రూ.35.03 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో అధునాతన పరికరాలు, కొత్త అగ్నిమాపక వాహనాలు కొనుగోలు చేసి సిబ్బందికి ఎస్డీఆర్ఎఫ్ ప్రాథమిక కోర్సుల్లో శిక్షణ ఇప్పించారు. అగ్నిమాక శాఖకు చెందిన వెయ్యి మందికి తమిళనాడులోని అరక్కోణం, మహారాష్ట్రలోని పుణే, గుజరాత్లోని వడోదరా, ఏపీలోని కృష్ణా జిల్లాలో ఉన్న ఎన్డీఆర్ఎఫ్ కేంద్రాల్లో శిక్షణ ఇప్పించారు.