Hyderabad :హైదరాబాద్ కు మరో భారీ సంస్థ.. రూ.1000 కోట్లతో

హైదరాబాద్లో తాము రూ.1000 కోట్ల పెట్టుబడితో చిప్(Chips )ల ఉత్పత్తి పరిశ్రమ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్లు పీటీడబ్ల్యూ గ్రూప్ (Ptw group) ప్రతినిధులు తెలిపారు. సెమీకండక్టర్ పరిశ్రమకు అవసరమైన విడిభాగాలు, ఆటోమేషన్, ఇతర పరికరాలను సరఫరా చేసే ఈ సంస్థకు సింగపూర్(Singapore) లో ప్రాంతీయ కార్యాలయం ఉంది. సచివాలయంలో సంస్థ ఆసియా విభాగం ఎండీ టార్ స్టెన్ సెయ్ ఫ్రైడ్ ఆధ్వర్యంలో ప్రతినిధులు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు (Duddilla Sridharbabu )తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సెమీ కండక్టర్ ( చిప్ల తయారీ), దాని అనుబంధ పరిశ్రమలకు హైదరాబాద్ అనుకూల వాతావరణం ఉంది. నైపుణ్యమున్న మానవ వనరులకు కొదువ లేదు. అందుకే సెమీకండక్టర్ క్లస్టర్ ఏర్పాటు విషయాన్ని పరిశీలిస్తున్నాం. హైదరబాద్లో పరిశ్రమ ఏర్పాటుకు సరైన ప్రతిపాదనలతో వస్తే ప్రభుత్వ విధానాల ప్రకారం రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తాం అని వారికి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో పీటీడబ్ల్యూ గ్రూప్ స్థానిక భాగస్వామి బార్ ట్రానిక్స్ ఎండీ విద్యాసాగర్ రెడ్డి, సింగపూర్కు చెందిన కన్సల్టెంట్ సంస్థ టాప్ 2 పీటీఈ సీఈవో రావు పనిదపు పాల్గొన్నారు.