Ande Sri: లోక సంచారి అందెశ్రీతో నా అనుభవాలు
— లక్ష్మణ్ ఏనుగు, న్యూయార్క్, అమెరికా (మాజీ అధ్యక్షుడు, తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరమ్)
కూర్చున్న చోటనే ప్రపంచం గురించి ఆలోచిస్తారు..
కూసింత ఆలోచనతో ప్రయాణాలు చేస్తే అహంకారం పోతది..
ప్రపంచాన్ని చూడటం వల్ల కళ్లకు కమ్ముకున్న పొరలు పోతాయి..
—- అందెశ్రీ
సహజకవిగా, తెలంగాణ మట్టిబిడ్డగా పేరొందిన అందెశ్రీ అన్నతో నా అనుబంధం చాలా ప్రత్యేకమైనది. అనూహ్యంగా వారితో జరిగిన పరిచయం ఆ తర్వాత ఎంతో బలపడింది. ఎన్నో రోజులు, చర్చలు, అనుభవాలు, ప్రయాణాలు అన్నతో పంచుకునే అదృష్టం నాకు కలిగింది. ఆయనది ఒక ప్రత్యేక లోకం. ఎదుటి వ్యక్తులను అంత తొందరగా అంగీకరించని అందెశ్రీ ఒక సారి తనకు నచ్చితే మాత్రం అత్యంత ప్రేమ, ఆప్యాయతలు కురిపిస్తారు. ఆ అదృష్టం నాకు చాలా సంవత్సరాలు దక్కింది. అంతే జీవితానుభవాలను కూడా నేర్పింది.
వాడుకభాషలో తేలికైన పదాలతో అప్పటికప్పుడు మాటలు కలిపి, పాటలు రాసే అందెశ్రీతో నాది అరుదైన ప్రయాణమనే చెప్పాలి. ముందుగా 2011లో నల్లగొండలో జరిగిన ప్రవాసీ భారతీయ దివస్ కు అన్నను హైదరాబాద్ నుంచి తీసుకువెళ్లిన సందర్భం మా తొలి పరిచయం. ఇక అప్పటి నుంచి గత పద్నాలుగేళ్లుగా ఎక్కడున్నా ప్రతీవారం ఏదో ఒక సందర్భంలో మాట్లాడేవారు. ఏదో ఒక పనిలో ఉండే ఫోను ఎత్తకపోతే, మళ్లీ ఫోన్ చేసినప్పుడు నాన్నా లక్ష్మణా బిజీగా ఉన్నావా అంటూ పలకరించేవారు.
అప్పటికే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున సాగుతుండగా, అమెరికాతో పాటు వివిధ దేశాల్లో విస్తరించిన తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరమ్ కూడా తెలంగాణ భావజాల వ్యాప్తికి కృషిచేసింది. టీడీఎఫ్ తరపున అందెశ్రీని అమెరికా తీసుకుపోయాం. నచ్చిన వ్యక్తులతోనే సహ జీవనం, నచ్చిన ప్రదేశాల్లో తన మజిలీ కొనసాగించటం ఆయన ప్రత్యేకత. తిండిలో కూడా ఆయనది ప్రత్యేక పద్దతి. ఉదయమో, మధ్యాహ్నమో వండినవి తినటాన్ని అస్సలు ఒప్పుకోరు. పరిమిత పదార్థాలు ఉన్నా, అప్పటికి అప్పుడు వండిన అన్నం కూరలే తినేవారు. అందుకే అమెరికా వచ్చినా మిగతా కుటుంబాలతో అంతగా కలిసేవారు కాదు. ప్రోగ్రామ్ కోసం ఎక్కడికైనా వెళ్లినా… అది అయిపోగానే వెంటనే ఫోన్ చేసి లక్ష్మణా వచ్చి నన్ను తీసుకుపో అనేవారు. న్యూయార్క్ నగర వీధుల్లో కారులో తిరుగుతూ ఆయన మాటలు, పాటలు వినే అదృష్టం అనేకసార్లు నాకు దక్కింది.
అమెరికాలో ఉండగానే నీళ్లు, నదులపై ఆయనకు ఉన్న ఆరాటం బయటపడింది. ఆయన మొదటిసారి సినిమా పాట 2006లో జోగిని వ్యవస్థపై తీసిన గంగకు రాశారు. అందుకే ఆ గంగతో (తెలంగాణలో గోదావరి) పాటు అన్ని నదులపై ఆయనకు ప్రేమ పుట్టింది. వాక్కులమ్మ దయతో గంగనే నాకు గూడుతో పాటు, జీవితం ఇచ్చింది అనేవారు. అందుకే నది అంటే ఆయనకు అభిమానం. నదిని చూసినా, నీళ్లు కనిపించినా ఆయన కండ్లలో అంతులేని ఆనందం కనిపించేది. నది లోక నిధి కావ్యరచనకు పునాది పడింది అక్కడే. ప్రపంచ ప్రసిద్ద నదులు పుట్టిన ప్రదేశాలతో పాటు, వాటి ప్రయాణం, సముద్రాల్లో సంగమ ప్రదేశాలను చూడాలని ఆరాటపడ్డారు. దీంతో ఆయన ఆశ, ఆశయాన్ని తీర్చేందుకు నాతో సహా, మరికొందరు ప్రవాస తెలంగాణ వాసులు నడుంకట్టారు.
నది నడిచిపోతున్నదమ్మ.. నన్ను నావనై రమ్మన్నదమ్మ అంటూ అన్ని ప్రపంచ ప్రధాన నదులపై అందెశ్రీ కాలుమోపారు. బ్రెజిల్ లో ఉన్న అమెజాన్ నది పుట్టిన ప్రదేశంతో పాటు మిసిసిపి, నైలు, కాంగో, జాంబేజీ నదులను ఆయన స్పృశించారు. మిసిసిపీ నదికి అప్పట్లో అమెరికాలోనే ఉన్న వెదిరే శ్రీరామ్ తీసుకువెళ్లారు. నేను వెళ్లిన దక్షిణ అమెరికా యాత్ర మొత్తం 23 రోజులు, ఇందులో పది రోజులు పూర్తిగా అమెజాన్ నదిపై వందల కిలో మీటర్లు ప్రయాణమే. నాలుగైదు, నెలలు అమెరికాతో పాటు పలు దేశాల సంచారం. నదులపై ప్రయాణం, పరివాహ ప్రాంతాల జీవనశైలి అధ్యయనం ఒక జీవితకాలం అనుభవపాఠాలు నేర్పింది. నేను స్వయంగా ధైర్యం చేసి వ్యయ ప్రయాసలు కోర్చి ఆయన దక్షిణ అమెరికా యాత్రను ప్లాన్ చేయటంతో పాటు సహ ప్రయాణీకుడిగా వెళ్లే అదృష్టం దక్కించుకున్నాను. ఇలా అమెజాన్ ప్రయాణం నది పుట్టినచోట నుంచి సముద్రంలో కలిసేదాకా ప్రయాణం చేసిన మొదటి భారతీయులం మేమే అని అక్కడి స్థానికులు చెప్పటం ఆశ్చర్యాన్ని కలిగించింది.
తనకు ఏది అనిపిస్తే అది చేయటం, అదే ఆచరించటం ఆయన నైజం. నచ్చినా, నచ్చకపోయినా మొహం మీదనే చెప్పేవారు. ఓసారి కుటుంబంతో తిరుమలకు వెళ్లిన ఆయనకు అప్పటి ఈవో ప్రత్యేకంగా శ్రీవారి దర్శన భాగ్యం కల్పించారు. తీరా దర్శనం తర్వాత పూజారి దేవుడికి దండం పెట్టుకోమని కోరితే, దేవుడికి నమస్కారం చేసి, పక్కనే ఉన్న భార్య పాదాలకు నమస్కరించారట. దీంతో ఆశ్చర్యపోయిన పూజారులు ఇదేమిటని అడిగితే, తనను భరించి సేవచేసిన తన భార్యే తనకు దేవుడు, దేవత అన్నారట. ఈ విషయం స్వయంగా ఆయనే నాతో పంచుకున్నారు.
వాస్తవానికి అందెశ్రీ గారికి ఆరోగ్యంపై శ్రద్ద బాగానే ఉండేంది. ఎప్పుడు అమెరికాలో ఉన్నా ఉదయం, సాయంత్రం వాకింగ్ చేయటంతో పాటు, కాసేపు శ్వాసతో పాటు, యోగాసనాలు చేసేవారు. అలాంటి ఆయన చివరలో అరోగ్యాన్ని అశ్రద్ద చేశారని, బీపీ మందులు వేసుకోలేదనే వార్తను మేం జీర్ణించుకోలేకపోయాం.
ఎట్ల పుట్టినం, ఎట్ల బతికినం అనేది ముఖ్యం కాదు, పోయేటప్పుడు ఎలా పోయాం అనేదే ముఖ్యం. ఈ విషయంలో అందెశ్రీ అన్న అత్యంత అదృష్టవంతుడు. హఠాత్తుగా అందరికీ దూరమైనా ఆయన చావు మాత్రం గొప్పగా ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రే స్వయంగా పాడె మోయటం, మంత్రులంతా హాజరుకావటం, తెలంగాణ సమాజం అంతా తమ ఇంట్లో వ్యక్తిని కోల్పోయినట్లుగా బాధపడటం తెలంగాణ మట్టిబిడ్డకు దక్కిన అసాధారణ గౌరవం. జీవితమంతా పేరుకు పేద రాజులా బతికిన అందెశ్రీ ఆఖరిమజిలీ మాత్రం అతి గొప్పగా అధికారిక లాంఛనాలతో జరిగింది. ఒక ప్రజాకవికి ఇంతకంటే గొప్ప గౌరవం ఏముంటుంది. ఆయన ఆశించి, ఆశపడిన ఆ ఇల్లు ఒక్కటి పూర్తయితే అన్న కుటుంబానికి మరింత ఊరట దక్కేది. అందెశ్రీ అన్న ఇక లేరు, మళ్లీ రారు అన్న చేదు నిజం అబద్దమయితే బాగుండు. జయ జయహే తెలంగాణ.. రూపంలో ఆయన వదిలిన గుర్తులు భావితరాలకు అందేలా చర్యలు తీసుకునేలా ప్రభుత్వం, అనుబంధం ఉన్న సంస్థలు, వ్యక్తులు పాటుపడాలని కోరుకుంటున్నాము.






