Mahesh Goud: తెలంగాణ కోసం మీరు చేసిన త్యాగం ఏమిటో చెప్పాలి? : మహేశ్ కుమార్ గౌడ్

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో 50 వేల ఉద్యోగాలిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిది నెలల్లోనే 50 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చిందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్ని రంగాల్లో కాంగ్రెస్ మార్క్ పాలన కనిపిస్తోందని, ప్రజాపాలన పండుగలో ప్రజలంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మా ప్రభుత్వం వచ్చాక ఆసుపత్రుల్లో సౌకర్యాలు మెరుగుపరుస్తున్నాం. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మీరు చేసిన దోపిడీ ఇంతా అంతా కాదు. మళ్లీ అధికారంలోకి వస్తామని కేటీఆర్(KTR) పగటికలలు కంటున్నారు. రూ.లక్షల కోట్లు కొల్లగొట్టిన మీకు మళ్లీ అధికారం ఎందుకిస్తారు? సామాన్యుడి పాలన ఈ రాష్ట్రంలో జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రజల యాస, భాష, కట్టుబాట్లు, సంస్కృతికి అద్దంపట్టే విధంగా తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుంది. రాజీవ్ గాంధీ(Rajiv Gandhi) విగ్రహాన్ని తొలగిస్తామని కేటీఆర్ అంటున్నారు. రాజీవ్ చేసిన సేవల గురించి కేటీఆర్ కు తెలియదా? దేశం కోసం ప్రాణాలర్పించిన కుటుంబం గురించి మాట్లాడే హక్కు మీకు లేదు.తెలంగాణ కోసం మీరు చేసిన త్యాగం ఏమిటో చెప్పాలి? పదేళ్ల పాటు తెలంగాణ సంపద దోచుకున్న కుటుంబం కేసీఆర్ (KCR) కుటుంబం. భూములు, నిధులు, నియామకాల పేరుతో అడ్డంగా దోచుకున్నారు అని విమర్శించారు.