తనను విమర్శించే నైతిక హక్కు ఎవరికీ లేదు : కడియం

బీఆర్ఎస్ నేతలు అయోమయంలో ఉన్నారని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఆ పార్టీని వీడేందుకు సిద్ధమైన ఆయన తదుపరి కార్యాచరణపై దృష్టి సారించారు. కాంగ్రెస్ ఆహ్వానం నేపథ్యంలో ఆ పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు కుమార్తె కావ్యతో కలిసి మంత్రుల నివాస ప్రాంగణంలో తన అనుచరులతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ నేతలు తనను పార్టీలోకి ఆహ్వానించారని, రెండ్రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తానని చెప్పినట్లు తెలిపారు. కడియం ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతిస్తామని ఆయన అనుచరులు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ బలహీనపడిందన్న కడియం, పార్టీ నేతల నుంచి సహకారం లభించలేదని తెలిపారు. ఓడిపోయే పార్టీ నుంచి పోటీ వద్దని కావ్య అనుకున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేయమని పిలుపు వచ్చిందని, అందరి అభిప్రాయం మేరకు నిర్ణయం ఉంటుందన్నారు. ఆరూరి రమేష్ వద్దంటేనే కావ్యకు టికెట్ ఇచ్చారని తెలిపారు. తనను విమర్శించే నైతిక హక్కు ఎవరికీ లేదన్న ఆయన కావ్యను నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు.