హైదరాబాద్ లో గ్లోబల్ స్పిరిచ్యువాలిటీ మహోత్సవ్ : కిషన్ రెడ్డి

భారతదేశం అంటే సంస్కృతి, ఆధ్యాత్మిక శక్తి అని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డి కొనియాడారు. మార్చి 14 నుంచి 17 వరకు రంగారెడ్డి జిల్లా కన్హా శాంతివనంలో కేంద్ర పర్యాటకశాఖ, హార్ట్ఫుల్నెస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరగనున్న గ్లోబల్ స్పిరిచ్యువాలిటీ మహోత్సవ్ను పురస్కరించుకొని కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. భారత్ స్ఫూర్తితో యావత్ ప్రపంచం ప్రభావితం అవుతోందని, ఇది 140 కోట్ల మంది భారతీయులకు గర్వకారణమని సంతోషం వ్యక్తం చేశారు. ఆధ్యాత్మిక మహోత్సవాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభిస్తారని తెలిపారు. 16న జరిగే కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ హాజరవుతారని తెలిపారు. ముగింపు రోజు 17న ప్రపంచ ప్రఖ్యాత గురువులతో సమాలోచనలు జరుగుతాయని తెలిపారు. భారతదేశం హిందూ, బౌద్ధ, జైన, సిక్కు మతాలకు పుట్టినిల్లు ఇవి ప్రపంచమంతా విస్తరించడం ద్వారా శాంతిని బోధిస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో హార్ట్ఫుల్నెస్ గ్లోబల్ గైడ్ కమలేష్ డి పటేల్ ( దాజీ), త్రిదండి రామానుజ చినజీయర్స్వామి, రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి బోధమయానంద పాల్గొన్నారు.