Google: హైదరాబాద్ లో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్

గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ను (జీఎస్ఈసీని) హైదరాబాద్లో నెలకొల్పడానికి ఆ సంస్థ ముందుకొచ్చింది. ఈ కేంద్రం భారత్లోని మొదటిది కాగా, ప్రపంచంలోనే అయిదోది. ఆసియా పసిఫిక్ జోన్లో టోక్యో తర్వాత ఏర్పాటు చేస్తున్న రెండో సెంటర్ హైదరాబాద్లోనే కావడం విశేషం. గూగూల్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ రాయల్ హాన్సెన్ (Royal Hansen) ఆధ్వర్యంలోని కంపెనీ ప్రతినిధి బృందం హైదరాబాద్లోని తెలంగాణ సీఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy), ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబుతో భేటీ అయింది. రాష్ట్ర ప్రభుత్వంతో గూగుల్ కంపెనీ జీఎస్ఈసీ(Gsec) కి సంబంధించిన కీలక ఒప్పందాన్ని చేసుకుంది. ఈ కేంద్రం ఒక ప్రత్యేకమైన అంతర్జాతీయ సైబర్ సెక్యూరిటీ హబ్. అధునాతన భద్రత, ఆన్లైన్ భద్రత ఉత్పత్తులను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ ఏడాది అక్టోబరు 3న జరిగిన గూగుల్ ఫర్ ఇండియా 2024 కాన్క్లేవ్లోనే సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు విషయాన్ని ఆ కంపెనీ ప్రకటించింది.