Revanth Reddy: తెలంగాణ సమాజానికి ఆయన ఎంతో సేవ చేశారు : రేవంత్ రెడ్డి

తెలుగు రాష్ట్రాల్లో ఒకే పేరుపై యూనివర్సిటీలు, సంస్థలు ఉంటే పరిపాలనా పరమైన సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశముందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. దాన్ని పరిష్కరించేందుకే రాష్ట్రంలోని యూనివర్సిటీలు, సంస్థలకు తెలంగాణకు సంబంధించిన పేర్లు పెడుతున్నామని చెప్పారు. శాసనసభలో ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్, తెలుగు వర్సిటీ పేరు మార్పు తదితర బిల్లులు ప్రవేశపెట్టిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. చర్లపల్లి రైల్వే టెర్నినల్కు పొట్టి శ్రీరాములు (Potti Sriramulu) పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అనేక యూనివర్సిటీలకు పేర్లు మార్చుకున్నాం. పరిపాలనా సౌలభ్యం కోసమే కొన్ని వర్సిటీలకు ప్రొఫెసర్ జయశంకర్, కొండ లక్ష్మణ్ బాపూజీ, పీవీ నరసిహారావు, కాళోజీ నారాయణరావు పేర్లు పెట్టుకున్నాం. అదే ఒరవడిలో పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాప్రెడ్డి (Suravaram Pratap Reddy) పేరు పెడుతున్నాం. తెలంగాణ సమాజానికి ఆయన ఎంతో సేవ చేశారు. గోల్కొండ పత్రికను సురవం నడిపారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు. పొట్టి శ్రీరాములు వర్సిటీ పేరు మార్చడం ఎవరికీ వ్యతిరేకం కాదు అని అన్నారు.
దివంగత మాజీ సీఎం రోశయ్య (Rosaiah), ఆర్యవైశ్య సమాజం పట్ల ప్రభుత్వానికి అపారమైన గౌరవం, నమ్మకం, విశ్వాసం ఉంది. కులం, మతం పేరుతో రాజకీయ ప్రయోజనాలు పొందాలనుకోవడం సరికాదు. చర్లపల్లి రైల్వే టెర్నికల్కు పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్కు లేఖ రాస్తా. దేశం కోసం ఆయన చేసిన త్యాగాలను గుర్తుచేసుకుందా. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకురావాలని కిషన్ రెడ్డి, బండి సంజయ్ను కోరతున్నా అని అన్నారు.