మేం గేట్లు తెరిస్తే ఆ పార్టీలో ఎవరూ ఉండరు : సీఎం రేవంత్

బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటై పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించాలని, తమ ప్రభుత్వాన్ని కూల్చేయాలని చూస్తున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో నిర్వహించిన ప్రజాదీవెన సభలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ మేం గేట్లు తెరిస్తే బీఆర్ఎస్లో కేసీఆర్ కుటుంబ సభ్యులు తప్ప ఎవరూ ఉండరని వ్యాఖ్యానించారు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి కాంగ్రెస్ 14 ఎంపీ సీట్లను గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చింది పార్టీ కార్యకర్తలే. ఖమ్మం జిల్లాలోని మొత్తం 10 సీట్లలో 9 స్థానాల్లో మమ్మల్ని గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఖమ్మం నుంచే ప్రారంభించాం. ఈ ఇళ్లు పేదలకు దేవాలయాలు, వీటి నిర్మాణానికి రూ.22,500 కోట్లు కేటాయించాం. గత ప్రభుత్వంలో హామీలను అమలు చేయకుండా కేసీఆర్ మోసం చేశారు. అందుకే ఖమ్మం ప్రజలు బీఆర్ఎస్ను 100 మీటర్ల గోతిలో పాతిపెట్టారు అని అన్నారు.