Revanth Reddy: అందెశ్రీ పాడె మోసిన సీఎం రేవంత్ రెడ్డి
ప్రముఖ కవి, రచయిత, ఉద్యమ గొంతుక, తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ గారి పార్థీవ దేహాన్ని సందర్శించి ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు వారికి నివాళులర్పించారు. ఎంతోకాలంగా అత్యంత సన్నిహితంగా మెలిగిన అందెశ్రీ గారి ఆకస్మిక మరణంతో భారమైన హృదయంతో ముఖ్యమంత్రి గారు వారి అంతిమయాత్రలో పాల్గొని అశ్రునివాళి అర్పించారు.
అంతిమయాత్రలో పాల్గొన్న ముఖ్యమంత్రి గారు అందెశ్రీ గారి పాడె మోశారు. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, సాహితీప్రియులు అక్షరయోధుడికి కడసారి వీడ్కోలు పలికారు. మొదట లాలాపేట్ జయశంకర్ స్టేడియం నుంచి తార్నాక, ఉప్పల్ మీదుగా ఘట్కేసర్ ఎన్ఎఎఫ్సీ నగర్ వరకు అంతిమ యాత్ర సాగింది.
అందెశ్రీ గారి సతీమణి మల్లుబాయి గారు, కుమార్తెలు వాక్కులమ్మ, వెన్నెల, వేకువ, కుమారుడు దత్తు సంప్రదాయం పద్ధతిలో కర్మకాండలను నిర్వహించగా, అధికారిక లాంఛనాలతో అందెశ్రీ గారి అంత్యక్రియలు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి గారు అందెశ్రీ గారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అంతిమ సంస్కార కార్యక్రమాన్ని దగ్గరుండి పరిశీలించారు.
సాహిత్య సమరయోధుడి అంతిమయాత్రలో ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, జూపల్లి కృష్ణారావు గారు, ధనసరి అనసూయ సీతక్క గారు, పొన్నం ప్రభాకర్ గారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారు, కే కేశవరావు గారు, పీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.







