Ramachandra Rao: దమ్ముంటే ప్రజాక్షేత్రంలో నిలబడి మాట్లాడండి : రామచందర్ రావు
దమ్ముంటే ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఎదురుగా నిలబడి సమాధానం చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు(Ramachandra Rao) అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన లీగల్ సెల్, ఐటీ సెల్, సోషల్ మీడియా టీమ్ల సంయుక్త సమావేశానికి రాంచందర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సోషల్ మీడియా (Social media) వెనుక దాక్కొని అసత్యాలు ప్రచారం చేయొద్దు. ఇప్పటికే బీజేపీ(BJP) లీగల్ సెల్ ఆధ్వర్యంలో తప్పుడు ప్రచారం చేస్తున్న కొన్ని యూట్యూబ్ చానళ్లపై పరువు నష్టం దావా వేశాం. ప్రధాని మోదీ (Modi), తమ పార్టీ నేతలపై ఎవరైనా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేస్తే ఊర్కోం. తప్పుడు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ (BRS) నాయకులపై మా పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో కేసులు పెట్టి జైలుకు పంపేలా చర్యలు తీసుకుంటాం అని అన్నారు. మోదీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్థిపై విశ్లేషించండి, కానీ వ్యక్తిగత దాడులు చేయడానికి సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తే సహించేది లేదన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కొంతమంది సోషల్ మీడియా సృష్టికర్తలకు నిధులిచ్చి బీజేపీని బద్నాం చేయించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. విపక్షాలు ఎక్కడైనా బీజేపీ నేతలపై తప్పుడు ప్రచారం చేస్తే పార్టీ కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్లు వెంటనే ప్రతిస్పందించాలన్నారు. తెలంగాణలో బీజేపీ రోజురోజుకూ బలపడుతున్నందునే బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఐటీ సెల్, సోషల్ మీడియాల ఫేక్ అకౌంట్ల ద్వారా తమ నేతలపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.






