Bandi Sanjay: వారే మా బ్రాండ్ అంబాసిడర్లు : బండి సంజయ్
తెలంగాణలో కేటీఆర్, దేశంలో రాహుల్ గాంధీలు ఐరన్లెగ్లు, వారే మాకు బ్రాండ్ అంబాసిడర్లు అని కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఎద్దేవా చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంజయ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశంలో కాంగ్రెస్ (Congress) ప్రాంతీయ పార్టీగా మారిపోగా, తెలంగాణలో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ (BRS) ఉప ప్రాంతీయ పార్టీగా మారిందన్నారు. రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ కు మనుగడ కష్టమని చెప్పారు. కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక జీహెచ్ఎంసీలో ఆ పార్టీ బలం 99 నుంచి 56కు పడిపోయింది. ఉప ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోతూనే ఉంది. చెల్లెలు ఓడిపోయింది. ఆమె పార్టీకి దూరమయ్యారు. సిటింగ్ ఎమ్మెల్యే స్థానాలనూ బీఆర్ఎస్ కోల్పోయింది అని అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓట్ చోరీ జరిగిందా? లేదా? అనేదానికి రాహుల్, రేవంత్లు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మైనారిటీల ఓట్లతోనే కాంగ్రెస్ గెలిచిందని, మజ్లిస్ పార్టీ సొంతంగా గెలవలేక కాంగ్రెస్ తరఫున అభ్యర్థిని నిలబెట్టిందని ఆరోపించారు. బిహార్లో అబ్ కీ బార్ 160 పార్, అంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ఇచ్చిన నినాదం వంద శాతం సక్సెస్ అయిందన్నారు. బిహార్ అయిపోయింది, ఇక బెంగాల్, 2028లో తెలంగాణ, మా టార్గెట్ అని ఆయన అన్నారు.






