కరోనా పై పోరులో ‘ప్రకాశం”.. సున్నా పాజిటివ్ సాధించిన తొలిజిల్లాగా రికార్డు
ఆంద్రప్రదేశ్ రాష్ట్రం లో కరోనా వైరస్ వ్యాప్తి మొదలైన తొలినాళ్లలో అత్యధిక కేసులు వచ్చిన జిల్లాల్లో ప్రకాశం జిల్లా కూడా ఉంది. ఇప్పుడు అదే జిల్లా జీరో పాజిటివ్ కేసులతో ఆ ఘనత సాధించిన తొలి జిల్లాగా నిలిచింది. ఈ జిల్లాలో అధికార యంత్రాంగం దృఢ సంకల్పంతో పనిచేసి కరోనా మహమ్మారిని విజయవంతంగా నియంత్రించింది. జిల్లాలో అత్యధికంగా 63 పాజిటివ్ కేసులు రాగా, మే 16 నాటికి అందరూ కోలుకుని డిశ్చార్జి అయ్యారు. జిల్లాలో ఇప్పుడు ఒక్క పాజిటివ్ కేసు కూడా లేదు. దాంతో కరోనా రోగులందరూ కోలుకుని డిశ్చార్జి అయిన తొలి జిల్లాగా నిలిచింది. విశేషం ఏమిటంటే ఏపీలో మరే జిల్లాలోనూ రోగులు మొత్తం డిశ్చార్జి అయింది లేదు.
వైద్యులు, పోలీసులు, వలంటీర్ వ్యవస్థ అన్ని విభాగాలూ సమన్వయంతో పనిచేసిన ఫలితమే జిల్లాలో జీరో పాజిటివ్ వచ్చిందని స్థానికులు ప్రశంసిస్తూన్నారు. కరోనా సంక్షోభం మొదలైన దగ్గర నుంచీ జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్, ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ తమ సిబ్బందితో కలిసి తీవ్రంగా శ్రమించారు. గత కొన్నివారాల నుంచి ప్రకాశం జిల్లాలో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. అధికారులు లాక్ డౌన్ నిబంధనలను అత్యంత కఠినంగా అమలు చేయడం కూడా కరోనా వ్యాప్తిని కట్టడి చేసింది. అయినప్పటికీ ప్రకాశం జిల్లా అధికారులు పరిస్థితులపై ఓ కన్నేసి ఉంచారు. జిల్లాలో కొత్త కేసులేవీ లేకపోయినా మరికొన్నాళ్లపాటు ప్రజలందరూ ఇళ్లకే పరిమితమై సురక్షితంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఏదేమైనా చిత్తశుద్ది తో ప్రయత్నం చేస్తే కరోనా ని నియంత్రించడం సాధ్యమేనని ప్రకాశం జిల్లా నిరూపించింది.






