BJP: మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే టార్గెట్..తెలంగాణ బీజేపీకి పెను సవాల్..!
తెలంగాణలో బీజేపీకి 8 మంది ఎంపీలున్నారు. ఏడుగురు ఎమ్మెల్యేలున్నారు. పార్టీకి మంచి కేడర్ ఉంది. ముందుండి నడిపించే ఆర్ఎస్ఎస్, వీహెచ్పీ, బజరంగ్ దళ్ లాంటి సంస్థలు అండగా ఉన్నాయి. అయినా సరే ఇటీవలికాలంలో వరుస పరాజయాలు పలకరిస్తున్నాయి. మరీ ముఖ్యంగా జూబ్లీహిల్స్ బైపోల్, సర్పంచ్ ఎన్నికల్లో .. పార్టీ ఘోరంగా ఓటమిపాలయింది. దీంతో బీజేపీ హైకమాండ్.. పార్టీ నేతలకు క్లాస్ పీకినట్లు తెలుస్తోంది.
తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ ఘోరమైన ఫలితాలు వచ్చాయి. కనీసం ఆరు శాతం గ్రామాల్ని కూడా గెల్చుకోలేక, కొన్ని చోట్ల అసలు పార్టీ జెండా పట్టుకునే వాళ్ళు లేక ఒక రకమైన ఇబ్బందికర వాతావరణం ఏర్పడింది. గతంలో కంటే ఎక్కువ సీట్లు గెల్చుకున్నామని రాష్ట్ర నాయకులు సంబరపడ్డారు. కానీ వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం సంపాదించాలని ఉవ్విళ్లూరుతున్న పార్చీకి మరీ… అంత అల్ప సంతోషమైతే ఎలాగన్నది కీలక ప్రశ్నగా కనిపిస్తోంది.
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. మొత్తం 117 మున్సిపాలిటీలు, 6 మున్సిపల్ కార్పొరేషన్స్కు ఎన్నికలు జరగబోతున్నాయి. అవి పార్టీ సింబల్స్ మీదే జరుగుతాయి కాబట్టి అన్ని ప్రధాన పక్షాలకు సవాలే. మిగతా వాటి సంగతి ఎలా ఉన్నా… పట్టణ పార్టీ ముద్ర ఉన్న బీజేపీకి ఇది నిజంగా అగ్ని పరీక్షేననని అంటున్నారు. పంచాయతీ ఎన్నికల్లో అంటే సరేనని సర్దిచెప్పుకోవచ్చుగానీ…. మున్సిపాలిటీల్లో కూడా పనితీరు సరిగా లేకపోతే… కేడర్లో నైతిక స్థైర్యం దెబ్బతింటుందని, రేపు అసెంబ్లీ ఎన్నికలకు వాళ్ళని సిద్ధం చేయడం కష్టమవుతుందన్న అభిప్రాయం పార్టీలోనే వ్యక్తం అవుతోంది.
గత ఎన్నికల్లో కరీంనగర్, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్స్లో పార్టీ మంచి ఫలితాలు సాధించింది. అలాగే పార్టీ ఎంపీలకు కూడా తమ పరిధిలోని కార్పొరేషన్స్లో పాగా వేయడం ప్రెస్టీజ్ ఇష్యూగా మారబోతోంది. బండి సంజయ్కి కరీంనగర్, ధర్మపురి అరవింద్కు నిజామాబాద్, డీకే అరుణకు మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్స్ అగ్నిపరీక్షేనని అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. మూడు చోట్ల పార్టీకి పట్టున్నందున ఆయా కార్పొరేషన్లలో జెండా ఎగరేయగలిగితేనే… పార్టీకి కూడా గౌరవప్రదంగా ఉంటుందన్నది విస్తృతాభిప్రాయం. మహబూబ్నగర్లో అంతకు ముందు బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు. ఇక నిజామాబాద్లో అయితే సిట్టింగ్ శాసనసభ్యుడు బీజేపీనే. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బండి సంజయ్ కొద్ది ఓట్ల తేడాతో గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు అది వేరే సంగతి. ఈ పరిస్థితుల్లో… ఆ మూడు కార్పొరేషన్స్ని కైవసం చేసుకుంటేనే పార్టీ గౌరవం నిలబడుతుందని కాషాయ వర్గాలే మాట్లాడుకుంటున్నాయి. ఇక మున్సిపాలిటీల విషయానికి వస్తే బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోనే నిర్మల్ మున్సిపాలిటీ ఉంది. ఇక మిగతా ఎమ్మెల్యేలకు కూడా తమ పరిధిలోని మున్సిపాలిటీలను గెల్చుకోవడమన్నది నిజంగా సవాలేనంటున్నారు పరిశీలకులు.






