Airbus: ఏపీలో ఎయిర్బస్ కేంద్రం నెలకొల్పండి : మంత్రి లోకేశ్

వాణిజ్య విమానాలు, డిఫెన్స్, స్పేస్, హెలికాప్టర్ల తయారీలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎయిర్బస్ (Airbus) ను మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) ఆంధ్రప్రదేశ్కు ఆహ్వానించారు. రాష్ట్రంలో తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. దాదాపు రూ.16 లక్షల కోట్ల విలువైన వ్యవస్థను నడుపుతున్న ఆ సంస్థ పాలకమండలి భారత్ (India) లో తయారీకి ఉన్న అవకాశాల గురించి అన్వేషించడానికి తొలిసారి ఇక్కడికి వచ్చింది. ఎయిర్బస్ చైర్మన్ రెనె ఓబెర్మన్తో పాటు, ఆ సంస్థ ఇండియా, దక్షిణాసియా ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో భారత్కు వచ్చిన పాలకమండలిని కలిసేందుకు లోకేశ్ ఢల్లీికి వచ్చారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్నాయుడి (Rammohan Naidu) తో కలిసి వారితో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లోని వనరులు, పెట్టుబడుల అవకాశాల గురించి వివరించారు. రాష్ట్రంలో ప్రపంచస్థాయి ఏరోస్పేస్ తయారీ కేంద్రంతోపాటు అనుబంధ సఫ్లై చైన్ సులభంగా ఏర్పాటు చేసుకోవడానికి ఉన్న అవకాశాల గురించి ప్రజంటేషన్ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్లో సమీకృత కేంద్రం ( ఇంటిగ్రేటెడ్ క్లస్టర్) ఏర్పాటు చేయాలని లోకేశ్ ఎయిర్బస్ బోర్డుకు విజ్ఞప్తి చేశారు. ప్రధాన వ్యవస్థతోపాటు సరఫరాదారులు, ఎంఎస్ఎంఈ, ఇతర భాగస్వామ్య పక్షాలు ఒకేచోట కార్యకలాపాలు నిర్వహించుకుంటే తక్కువ ఖర్చుతోనే నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేయొచ్చన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో బహుళ ఏరోస్పేస్ కారిడార్లను అభివృద్ధి చేస్తున్నామని, వాటిలో తమ అవసరాలకు తగ్గట్లు ఇష్టమైన వాటిని ఎంచుకోవచ్చని చెప్పారు. అందుబాటులో ఉన్న స్థలాల్లో దేన్నయినా ఎంచుకొనే స్వేచ్ఛ ఇస్తామన్నారు.