ఇక భారత్ లోనే డిఫెన్స్ విమానాల తయారీ… మేకిన్ ఇండియా ఫలాలు అందుతున్నాయా..?

నిన్నటి వరకూ ఒక కథ.. ఇప్పుటి నుంచి లెక్క వేరు.. అంటున్నారు భారత ప్రధాని మోడీ. దేశరక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేయడంపై ఫోకస్ పెట్టిన మోడీ.. ఆదిశగా చర్యలు చేపడుతున్నారు. మోడీ చేపడుతున్న చర్యలు ఫలితాలిస్తున్నాయి కూడా. దేశంలోనే డిఫెన్స్ రవాణా విమానాల తయారీ ప్లాంట్ ప్రారంభమైంది. మోడీ, స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ వడోదరలో ఈ ప్లాంట్ ను ప్రారంభించారు.
ఎయిర్బస్ డిఫెన్స్ సంస్థతో కలిసి టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఈ ప్లాంట్ ను ఏర్పాటు చేసింది.. భారత రక్షణ శాఖ కోసం 40 విమానాలను ఈ ప్లాంట్లో ఎయిర్బస్-టాటా తయారు చేయనున్నాయి. భారతదేశంలో ప్రైవేట్ రంగంలో తొలి యుద్ధ విమానాల తయారీ కర్మాగారం అందుబాటులోకి వచ్చింది. . వచ్చే ఏడాది సెప్టెంబరు నుంచి ఉత్పత్తి మొదలవుతుంది. C-295 విమానాల FAL ప్లాంట్కు ప్రధాని మోడీ 2022లో శంకుస్థాపన చేశారు. సైన్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు చేపడుతోన్న కేంద్రం.. స్పెయిన్ నుంచి రఫేల్ యుద్ధ విమానాలతో పాటు సైనిక రవాణా విమానాల కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. ఈ క్రమంలో సీ 295 సైనిక రవాణా విమానాలను రూ.21 వేల కోట్లతో కొనుగోలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా సీ-295 రకం మిలటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న మిలటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ల కంటే శక్తివంతమైన ఇంజిన్, ఎక్కువ బరువును మోసుకెళ్లే సామర్థ్యం సీ-295 సొంతం. దీంతో 6 దశాబ్దాలుగా వినియోగిస్తున్న Avro-748 ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్లను వీటితో భర్తీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. 2021 సెప్టెంబర్లో భారత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ప్రకారం 56 విమానాల్లో 16 విమానాలను నేరుగా తయారు చేసి అప్పగించడంతో పాటు మరో 40 విమానాలను భారత్లోనే తయారు చేయాల్సి ఉంటుంది.
ఇందుకోసం టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్తో కలిసి గుజరాత్లోని వడోదరలో ప్లాంట్ ఏర్పాటు చేసింది. సైనిక అవసరాల కోసం భారత దేశంలో ఏర్పాటైన తొలి ప్రైవేట్ సెక్టార్ అసెంబ్లీ లైన్ కూడా ఇదే. ఈ ప్లాంట్ నుంచి తొలి విమానం 2026 సెప్టెంబర్లో బయటకు రానుంది. అప్పటి నుంచి మొదలుపెట్టి 2031 ఆగస్ట్ నాటికి మొత్తం 40 విమానాలను ఇక్కడ తయారు చేస్తారు. వడోదరలో తయారు చేసిన విమానాలను భవిష్యత్తులో ఎగుమతి చేస్తామని చెప్పారు ప్రధాని మోడీ. “టాటా-ఎయిర్బస్ తయారీ కేంద్రం భారతదేశం-స్పెయిన్ సంబంధాలను, ‘మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్’ మిషన్ను బలోపేతం చేస్తుందని తెలిపారు.