కాంగ్రెస్ కు ‘ట్రబుల్’ షూటర్…?

డికె శివకుమార్.. కాంగ్రెస్ హైకమాండ్ కు నమ్మినబంటు. దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల్లో ఒకరు. పార్టీ సమస్యల్లో ఉందంటే చాలు వెంటనే వెళ్లి చక్కదిద్దగలిగిన సమర్థుడు. అందుకే డికెను ముద్దుగా కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ అని పిలుస్తారు. అలాంటి డికె.. ఇప్పుడు కాంగ్రెస్ కు ట్రబుల్ షూటర్ గా మారారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాను అభివృద్ధి పనులకోసమే ప్రధాని మోడీతో సమావేశమయ్యానని డికె చెప్పినప్పటికీ.. కాంగ్రెస్ హైకమాండ్ లో మాత్రం కంపరం మొదలైందని చెప్పొచ్చు.
‘ముడా’ ఇంటి స్థలాల వివాదంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్యను విచారించేందుకు గవర్నర్ అనుమతి ఇవ్వటం తెలిసిందే. ఈ అంశంపై పార్టీ ఢిల్లీ పెద్దలకు వివరణ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి సిద్ద.. డిప్యూటీ సీఎం డీకేలు ఆగస్టు మూడో వారంలో ఢిల్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోడీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సొంత పార్టీ ముఖ్యమంత్రులకే భేటీలకు టైం ఇవ్వని మోడీ.. డీకేకు సమయం ఇవ్వటం ఏమిటన్నది బీజేపీలోనే కాదు కాంగ్రెస్ లోనూ చర్చనీయాంశంగా మారింది. ఏ చిన్న అవకాశం లభించినా..తాము టార్గెట్ చేసిన రాష్ట్రాల్లో ప్రభుత్వాల్ని ఏర్పాటు చేసే టాలెంట్ ఉన్న మోడీషాలకు.. డీకేలాంటోడు జత కలిస్తే.. అగ్నికి వాయువు తోడైనట్లు అవుతుంది.
అందుకే..కాంగ్రెస్ అధిష్ఠానంలో కలవరపాటు మొదలైంది. తమ అనుమతి లేకుండా ప్రధాని మోడీతో ఎలా భేటీ అవుతారంటూ హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. అయితే.. మంత్రిగా పలు డెవలప్ మెంట్ అంశాల మీదనే పీఎం మోడీని కలిశానని.. రాజకీయ ఉద్దేశం లేనట్లుగా వివరణ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. రాహుల్ అమెరికా టూర్ లో ఉన్న వేళ.. డీకే సైతం ఆ దేశానికి వెళ్లటం.. అక్కడ యువరాజా వారిని కలవటం ఎజెండా ఉందంటున్నారు.మొత్తానికి కాంగ్రెస్ కు ట్రబుల్ షూటర్ కాస్తా ట్రబుల్ అయ్యాడన్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.