Keiv: ఓవైపు ఖైదీల విడుదల… మరోవైపు డ్రోన్లు, క్షిపణులతో రష్యా దాడి

ఉక్రెయిన్ (Ukraine)-రష్యా (Russia) మధ్య ఖైదీల మార్పిడి జరుగుతున్న సమయంలోనే…భీకర దాడులు కొనసాగాయి. ఓవైపు వందలాది మంది సైనికులు, పౌరులను విడిచిపెట్టిన రష్యా.. ఉక్రెయిన్పై భీకర దాడులకు తెగబడింది. దాదాపు 367 డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేయగా.. వీటిల్లో 12 మంది మృతిచెందారు. మూడేళ్ల యుద్ధంలో ఒకేసారి ఈ స్థాయిలో డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేయడం ఇదేతొలిసారి అని ఉక్రెయిన్ సైనిక వర్గాలు వెల్లడించాయి.
యుద్ధ ఖైదీల అప్పగింతలో భాగంగా శుక్రవారం ఇరుపక్షాలు 390 మంది చొప్పున మార్పిడి చేసుకోగా శనివారం 307 మందిని ఇరుదేశాలు మార్పిడి చేసుకున్నాయి. తాజాగా మరో 303 సైనికులను పరస్పరం అప్పగించుకున్నట్లు రష్యా రక్షణశాఖ వెల్లడించింది. ఈ ప్రకటన రాకముందు కీవ్తోపాటు ఇతర ప్రాంతాలపై మాస్కో భీకర దాడులు చేసింది. ఒకేరోజు 69 క్షిపణులతో పాటు 298 డ్రోన్లలో విరుచుకుపడింది. వీటిలో ఇరాన్(Iran) రూపొందించి షాహెద్ డ్రోన్లు కూడా ఉన్నట్లు సమాచారం. మొత్తంగా ఈ దాడుల్లో 12 మంది చనిపోగా.. అనేకమంది గాయాలపాలయ్యారు.
ఉక్రెయిన్లోని 30 నగరాలు, గ్రామాలపై ఉద్దేశపూర్వక దాడులు జరిగాయని అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రష్యాపై ఆంక్షలు విధించాలని పాశ్చాత్య దేశాలను అభ్యర్థించారు. రష్యా నాయకత్వంపై బలమైన ఒత్తిడి తీసుకువస్తే తప్పితే ఈ దారుణాలకు అడ్డుకట్ట వేయలేమన్నారు.