భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై… అమెరికా ఆందోళన

భారత్లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై అమెరికా విదేశాంగ శాఖ ఉన్నతాధికారి డీన్ థాంప్సన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ప్రజాస్వామ్య తీరు తెన్నులపై ఇటీవల జరిగిన శాసనకర్తల ఉపసంఘం భేటీలో ఆయన మాట్లాడుతూ భారత్లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై ఆంక్షలు సహా కొన్ని అంశాలు ఆ దేశ ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. భారత్లో బలమైన చట్టబద్ధ పాలన, స్వతంత్ర నాయవ్యవస్థ ఉన్నప్పటికీ కొన్ని అంశాల్లో మాత్రం భారత్ చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇందులో వాక్ స్వాతంత్య్రంపై నియంత్రణ, పాత్రికేయుల్ని నిర్బంధించడం వంటివి ఉన్నాయన్నారు. భారత్లోని పత్రికా రంగం స్వేచ్ఛగా తన అభిప్రాయాలు వ్యక్తం చేసుకుంటుందని అన్నారు. తప్పుడు ప్రచారానికి అడ్డుకట్ట వేస్తూనే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను గౌరవించేలా ప్రభుత్వంతో కలిసి కృషి చేస్తామని మరో ఉన్నతాధికారి అన్నారు. కశ్మీర్ సహా హక్కులు, ప్రజాస్వామ్య అంశాలపై భారత ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు అమెరికా మాట్లాడుతుంటుందని తెలిపారు.