ఈ దాడితో ప్రపంచవ్యాప్తంగా దేశ ప్రతిష్ట పెరిగింది : ఖొమేనీ
ఇజ్రాయెల్పై ఇరాన్ భారీస్థాయిలో క్షిపణులు, డ్రోన్లు, ప్రయోగించింది. ఇజ్రాయెల్కు మాత్రం స్వల్ప నష్టమే జరిగింది. ప్రయోగించిన 300కి పైగా డ్రోన్లు, బాలిస్టిక్, క్రూజ్ క్షిపణులు పెద్దగా ప్రభావం చూపలేదు. ఈ విషయాన్ని దాడి అనంతరం ఇజ్రాయెల్, అమెరికా కూడా తెలిపాయి. ఇరాన్ ఈ నెల 13న చేసిన దాడిలో డ్రోన్లు, క్షిపణుల్లో 99 శాతాన్ని కూల్చి వేశామని ప్రకటించాయి. ఈ విషయాన్ని ఇప్పుడు ఇరాన్ కూడా పరోక్షంగా అంగీకరించింది.
ఇరాన్ సర్వోన్నత నేత అయాతుల్లా అలీ ఖొమేనీ మాట్లాడుతూ ప్రయోగించిన క్షిపణుల సంఖ్య, తాకిన లక్ష్యాల లెక్కలకు అంత విలువ లేదని అన్నారు. దాడితో ప్రపంచవ్యాప్తంగా దేశ ప్రతిష్ఠ పెరిగిందని, అదే కీలకమని చెప్పారు. మనం ఎన్ని క్షిపణులు ప్రయోగించాం. అందులో ఎన్ని లక్ష్యాన్ని తాకాయి. ఎన్ని తాకలేదన్న చర్చ అప్రస్తుతం. ప్రధానమైన విషయమేంటంటే అంతర్జాతీయంగా ఇరాన్ దేశం, సైన్యం ముఖ్యంగా ఒక శక్తిగా ఆవిర్భవించింది. అదే మనకు కీలకం. ఇందుకు సైన్యాన్ని రివల్యూషనరీ దళాలను అభినందిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా దేశ ప్రతిష్టను పెంచారు అని తెలిపారు.






