సన్నిహితులకు కరోనా వస్తే.. సేవలూ…జాగ్రత్తలూ…
ప్రస్తుతం లక్షల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నపరిస్థితుల్లో.. బాధితులు అందరికీ ఆసుపత్రులు సేవలు అందించడం అసాధ్యమని ప్రభుత్వాలు చెప్పకనే చెబుతున్నాయి. ఈ నేపధ్యంలో తమ సన్నిహితులు,కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ అని తేలినప్పుడు కోవిడ్-19 అనుమానితులు, బాధితులకు సేవలు అందించేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమటి? దీనిపై కేంద్ర ఆరోగ్యశాఖ పలు సూచనలు చేసింది.
కోవిడ్-19 అనుమానితులు/సంరక్షకులు ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి. ఒకవేళ ఏమైనా అనారోగ్యానికి సంబంధించిన లక్షణాలు, తీవ్రమైన లేక కొత్త లక్షణాలు ఏవైనా కనిపించినట్టయితే వెంటనే వైద్యుల సాయం పొందాలి. కోవిడ్ బాధితులకు సాధారణంగా ఉండే లక్షణాల్లో దగ్గు, గొంతునొప్పి, పెదాలు/ముఖం నీలం రంగులోకి మారడం, విపరీతమైన జ్వరం,ఛాతిలో నొప్పి లేదా నొక్కినట్టు ఉండడం,శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు, రుచి, వాసన తెలుసుకునే సామర్థ్యం తగ్గడం వంటి లక్షణాలు కనపడితే వెంటనే వైద్య సాయం తీసుకోవాలి. అలాగే కోవిడ్-19 అనుమానితులు, బాధితులకు సేవలందించేవారికి సూచనలు..
మాస్కు వినియోగం ఇలా…
అనారోగ్యంగా ఉన్న వ్యక్తి గదిలోనే మీరూ ఉన్నట్లయితే మూడు పొరల మెడికల్ మాస్క్ తప్పనిసరిగా వేసుకోవాలి. సాధ్యమైనంత వరకు మాస్క్ ముందు భాగాన్ని తాకకూడదు లేదా పైకి క్రిందికి కదపరాదు. నోటి నుంచి వచ్చే తుంపర్లు, ముక్కు నుంచి కారే నీటితో మాస్క్ తడిగా మారినపుడు లేదా మురికిగా అయితే వెంటనే మాస్కును మార్చేయాలి. ఒకసారి ఉపయోగించిన మాస్కును మళ్లీ వాడరాదు. దాన్ని తీసివేసినపుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక మూతగల చెత్త డబ్బాలో మాస్కును జాగ్రత్తగా పారవేయాలి. చెత్త బుట్టలో వేసిన మాస్కులన్నింటిని రోజులో ఒకసారి ఇంటి బయట కాల్చి వేయవలెను.
ఒక మాస్క్ ఆరు గంటలకు మించి వాడకూడదు. బాధితులకు దగ్గర ఉన్నప్పుడు వారి ముక్కు, నోరు, కళ్ళను తాకకుండా ఉండాలి.
– పేషెంట్ కు ఆహారం మరియు ఇతర అవసరాలను వారు ఉంటున్న గదిలోనే అందించాలి.
– సేవలు అందించడానికి వెళ్ళే ముందు మరియు అందించిన తర్వాత తప్పక చేతులను సబ్బు మరియు నీటితో కనీసం 40-60 సెకన్ల పాటు కడుక్కోవాలి. తర్వాత శానిటైజర్ ను అప్లై చేయాలి.
– ఆహారం వండడానికి ముందు మరియు తరువాత, తినడానికి ముందు, మరుగుదొడ్డిని ఉపయోగించిన తర్వాత, చేతులు మురికిగా అనిపించినపుడు సబ్బు మరియు నీటితో కనీసం 40-60 సెకన్లు కడుక్కోవాలి. ఆ తర్వాత చేతులు పైకి ఉంచి గాలికి ఆరబెట్టాలి.
– కోవిడ్-19 చికిత్స పొందుతున్న వారి శరీరం నుంచి వచ్చే చెమట, నోటి నుంచి వచ్చే ఉమ్మి, ముక్కు నుంచి కారే నీరు ఇవేవీ తాకకుండా జాగ్రత్తగా ఉండాలి. తప్పనిసరి పరిస్థితుల్లో తాకవలసి వస్తే వెంటనే చేతులు సబ్బు మరియు నీటితో కనీసం 40-60 సెకన్లు కడుక్కోవలెను. కడుక్కొన్న తరువాత చేతులు పైకెత్తి గాలికి ఆరబెట్టుకోవాలి
– కోవిడ్-19 బాధితుడు ఉన్న గదిలో ఏ వస్తువును ముట్టుకోవద్దు
– పేషెంట్ వాడే బెడ్ షీట్స్, టవల్స్, ప్లేట్, గిన్నెలు, గ్లాసులను గుర్తించి వాటిని ప్రత్యేకంగా ఉంచాలి. వీటిని మిగిలిన సామాన్లు/వస్తువులతో కలపవద్దు. వీటిని ముట్టుకున్న వెంటనే చేతులు కడుక్కోవాలి.
– ఒకవేళ పేషెంట్ వాడిన వస్తువులు ఏవైనా తప్పనిసరిగా ఉపయోగించాల్సి వస్తే కనీసం 30 నిమిషాలు వేడి నీటిలో ఉంచిన తర్వాత మాత్రమే ఉపయోగించాలి.
– ఉపరితలాలను తాకవలసి వచ్చినపుడు లేదా శుభ్రపరిచినపుడు పేషెంట్ ఉపయోగించిన బట్టలు, దుప్పట్లు ఉతికినపుడు మూడుపొరల మాస్క్ (త్రిపుల్ లేయర్ మెడికల్ మాస్క్) వాడాలి.
– వైద్యులు ఇచ్చిన మందులన్నింటినీ సూచించిన సమయానికి రోగికి ఇచ్చి తప్పక వేసుకునేటట్లు చూడాలి.
– ప్రతిరోజూ పేషెంట్ శరీర ఉష్ణోగ్రత తెలుసుకుంటూ ఉండాలి. వ్యాధి లక్షణాలయిన జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, నిలబడలేనంత బలహీనత, ఛాతిలో నొప్పి ఎక్కువయినట్టు అనిపిస్తే వెంటనే మీ పైస్థాయిలో ఉన్న వైద్య సిబ్బందికి సమాచారం ఇవ్వాలి.






