Washington: చైనాకు మరో 90 రోజుల గడువు.. వెనక్కి తగ్గిన ట్రంప్..

చైనాతో ఇంకా పూర్తిస్థాయి ఒప్పందం కుదరకున్నప్పటికీ.. డ్రాగన్ దేశానికి కాస్త ఉపశమనం కల్పించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. డ్రాగన్పై (China) తొలుత సుంకాల మోత మోగించిన ఆయన.. ఆ దేశంతో వాణిజ్య ఒప్పందానికి మరో 90 రోజుల విరామం ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు. వాణిజ్య ఒప్పందం (Trade Truce) చర్చల గడువును పొడిగించినట్లు చైనా కూడా తన అధికారిక మీడియాలో పేర్కొంది.
చైనాతో వాణిజ్య ఒప్పందానికి తొలుత విధించిన 90 రోజుల గడువు ఈనె 13వ తేదీ అర్ధరాత్రి ముగియనున్న నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు పోటాపోటీగా పరస్పర సుంకాలు (100 శాతానికి పైగా) విధించుకున్న అమెరికా, చైనాలు.. ఆ తర్వాత వాటిని రద్దు చేసుకున్నాయి. ప్రస్తుతం చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై 30శాతం సుంకాలను మాత్రమే అమెరికా అమలు చేస్తోంది. భారత్పై 25 శాతం అమలు చేస్తుండగా.. ఈ నెల 27 నుంచి మరో 25 శాతం వసూలు చేసేందుకు సిద్ధమైంది.
భారత్ సహా ప్రపంచ దేశాలపై సుంకాలు విధించిన ట్రంప్.. ఆయా దేశాలతో వాణిజ్య ఒప్పందాలను చేసుకుంటున్నారు. కానీ, చైనాతో మాత్రం ఇప్పటివరకు డీల్ పూర్తికాలేదు. దీనిపై చర్చలు జరిపేందుకు ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నప్పటికీ కొన్ని అంశాల్లో ఏకాభిప్రాయానికి రానట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో అమెరికా, చైనా అధ్యక్షుల భేటీ జరగనుండగా.. తాజా విరామం వాణిజ్య ఒప్పందంపై చర్చలకు మార్గం సుగమం చేసినట్లు తెలుస్తోంది.
సుంకాల విషయంలో చైనా సమస్య కొంచెం సంక్లిష్టంగా ఉంటుందన్నారు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ . రష్యా నుంచి చమురు కొనుగోలుతో ముడి పెట్టలేని అనేక ఇతర అంశాలు ఇరు దేశాల సంబంధాలను ప్రభావితం చేస్తాయన్నారు. అదే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంగా భారత్పై ట్రంప్ అదనపు సుంకాలతో విరుచుకుపడుతున్నారు. చైనా కూడా రష్యా నుంచి భారీగా చమురు దిగుమతి చేసుకుంటున్న విషయం తెలిసిందే.