రూ.100 టిక్కెట్ తో… కోటి రూపాయలు గెలుచుకుంది!
రూ.100లు పెట్టి కొన్న లాటరీ టిక్కెట్ ఓ గృహిణిని రాత్రికి రాత్రే కోటీశ్వరురాలిని చేసింది. ఈ ఘటన పంజాబ్లోని అమృత్సర్లో జరిగింది. అమృత్సర్కు చెందిన రేణూ చౌహాన్ ఇటీవల రూ.100లకు లాటరీ టిక్కెట్ కొనుగోలు చేశారు. లాటరీ తీయగా ఆమె టిక్కెట్ ప్రైజ్ విన్నర్గా నిలిచినట్టు పంజాబ్ ప్రభుత్వం వెల్లడించింది. దీంతో ఆమె ఏకంగా రూ.కోటి గెలుచుకుంది. రాష్ట్ర లాటరీస్ డిపార్ట్మెంట్లో లాటరీ టిక్కెట్తో పాటు అవసరమైన దస్త్రాలను అధికారులకు ఆమె సమర్పించారు. భగవంతుడి ఆశీస్సుల వల్లే తనకు ఈ లాటరీ తగిలిందంటూ రేణూ చౌహాన్ అమితానందం వ్యక్తం చేశారు.
మధ్యతరగతి కుటుంబమైన తనకు ఇదెంతో ఉపశమనం కలిగించిందన్నారు. తన భర్త అమృత్సర్లో వస్త్ర దుకాణం నడుపుతున్నారని చెప్పారు. ఈ లాటరీ ప్రైజ్ మనీ తమ జీవితం మరింత సజావుగా సాగేందుకు దోహదపడుతుందని చెప్పుకొచ్చారు రేణు. ఈ లాటరీ ఫలితాలను ఈ నెల 11న ప్రకటించినట్టు లాటరీ డిపార్ట్మెంట్ అధికారులు తెలిపారు. రేణు గెలిచిన టిక్కెట్ నంబర్ డి-12228 అని, నగదు పొందేందుకు అవసరమైన దస్త్రాలను ఆమె సమర్పించారన్నారు. ఫ్రైజ్ మనీని త్వరలోనే ఆమె బ్యాంకు ఖాతాలో జమచేయనున్నట్టు తెలిపారు.






