ఫ్రాన్స్ ఐటీ దిగ్గజం.. అటోస్ శుభవార్త!
వచ్చే ఏడాది భారత్లో 15,000 మంది ఉద్యోగుల నియామకానికి ఫ్రాన్స్ టెక్ దిగ్గజం అటోస్ సన్నాహాలు చేపట్టింది. సైబర్ సెక్యూరిటీ రంగంలో అగ్రగామిగా నిలిచేందుకు భారత్లో ఇప్పటికే పనిచేస్తున్న 40,000 మంది ఉద్యోగులకు అదనంగా భారీ సంఖ్యలో నూతన నియామకాల వైపు మొగ్గుచూపుతున్నట్టు కంపెనీ సీఈఓ ఎలీ గిరార్డ్ తెలిపారు. దేశంలో డిజిటైజేషన్ కారణంగా భారీగా ఉద్యోగుల అవసరం ఏర్పడినట్లు తెలిపారు. ప్రభుత్వ రంగం, డిఫెన్స్ తో సహా ఇతర రంగాలలో భారీగా డిమాండ్ ఏర్పడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన అన్నారు.ప్రపంచంలో ఈ నైపుణ్యాలు అధికంగా భారత యువతలో ఉన్నాయని చెప్పారు. భారత్లో మెరుగైన డిజిటల్ నైపుణ్యాలున్నాయని ఇది దేశానికి సానుకూలాంశమని అన్నారు.
తాము హార్డ్వేర్, సాఫ్ట్వేర్ సేవల్లోనూ ముందున్నామని అన్నారు. సైబర్ సెక్యూరిటీ సేవల్లో యూర్లో అగ్రస్థానంలో, ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్నామని అన్నారు. ఒకట్రెండు సంవత్సరాల్లో సైబర్ సెక్యూరిటీ సేవల్లో ప్రపంచంలోనే తాము నెంబర్వన్ స్థానానికి చేరుకుంటామని తెలిపారు. అత్యాధునిక టెక్నాలజీలకు తోడు 5జీ సేవలు అందుబాటులోకి రావడం సేవా రంగంలో ఉన్న సంస్థలకు విస్తృత అవకాశాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ప్రస్తుతం సంస్థ ఆదాయంలో దాదాపు మూడో వంతు భారతదేశం నుంచి వస్తున్నట్లు తెలిపారు.






