భారత్ నేపాల్ 'మ్యాపుల' యుద్ధం..
భారత్ -నేపాల్ మధ్య సరిహద్దుగొడవ మరో స్థాయికి చేరింది. దశాబ్దాల నుంచి నడుస్తున్న ఈగొడవను.. ఆదేశంలోని రాజకీయ వ్యవస్థ .. మరింతగా పెంచుకుంటూ పోయింది. ప్రజల్లో ఉన్న సెంటిమెంటును క్యాష్ చేసుకునే దిశగా అడుగులేస్తోంది. భారత్లోని భూభాగాలను తమ మ్యాప్లో చూపించడమే కాకుండా.. తమ దేశ కరెన్సీ నోటుపై కొత్త మ్యాప్ను ముద్రించాలని నేపాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
నేపాల్ కరెన్సీలోని రూ.100 నోటుపై పాత మ్యాప్కు బదులు కొత్త మ్యాప్ను రూపొందించాలని నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రచండ అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. నేపాల్ 4 సంవత్సరాల క్రితం తన రాజకీయ మ్యాప్లో ఈ మూడు ప్రాంతాలను చేర్చింది. దీనికి భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తాజాగా రూ.100 నోటుపై భారత్ భూభాగంలోని ప్రాంతాలు తమ భూభాగంలో ఉన్నట్లు చూపించే మ్యాప్ను ముద్రించాలని నిర్ణయం తీసుకోవడం ద్వారా భారత్తో నేపాల్ ఆటలాడేందుకు ప్రయత్నిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే పలు విషయాల్లో భారత్కు వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్న నేపాల్... తాజా నిర్ణయంతో భారత్-నేపాల్ మధ్య ఉద్రిక్తతలను పెంచే ప్రయత్నం చేస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. నేపాల్ తన కొత్త మ్యాప్లో లిపులేఖ్, లింపియాధుర, కాలాపానీలను చేర్చనుంది. ఈ మూడు ప్రాంతాలు ప్రస్తుతం భారతదేశంలోని ఉత్తరాఖండ్లోని భాగంగా ఉన్నాయి. కాగా ఈ మూడు ప్రాంతాలు తమవేనటూ నేపాల్ 1997 నుంచి వాదిస్తోంది. ఏప్రిల్ 25, మే 2 తేదీల్లో జరిగిన సమావేశంలో కొత్త రూ.100 నోటును రీడిజైన్ చేయడంతోపాటు కరెన్సీపై ముద్రించిన పాత మ్యాప్ను మార్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని నేపాల్ మంత్రి తెలిపారు. 2020 జూన్ 18న నేపాల్ తన రాజకీయ మ్యాప్లో లిపులేఖ్, లింపియాధుర, కాలాపాని ప్రాంతాలను చేర్చింది.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భాగంగా ఉన్న లిపులేఖ్, లింపియాధుర, కాలాపాని ప్రాంతాలు తమ మ్యాప్లో చూపిస్తూ నేపాల్ ప్రభుత్వం తమ రాజ్యాంగాన్ని సవరించింది. దీనిపై భారత్ అప్పట్లో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. నేపాల్ సిక్కిం, పశ్చిమ బెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లతో సరిహద్దు ప్రాంతాలను కలిగి ఉంది. లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురాపై ప్రస్తుతం భారత్ హక్కులు కలిగి ఉంది. ఈ ప్రాంతాలు ఉత్తరాఖండ్ సరిహద్దుకు ఆనుకుని ఉన్నాయి.