అంతరిక్షంలోకి తెలుగు అమ్మాయి….

తెలుగు మూలాలు ఉన్న అమెరికా యువతి బండ్ల శిరీష(26) అంతరిక్ష పర్యటనకు వెళ్లనున్నారు. అంతరిక్ష పర్యాటకాన్ని ప్రోత్సహించడం కోసం ఈ నెల 11న అమెరికాకు చెందిన వర్జిన్ గెలాక్టిక్ సంస్థ స్పేస్ ఫ్లైట్ను పంపిస్తున్నది. ఇందులో సంస్థ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రాన్సన్, సంస్థ లీడ్ ఆపరేషన్స్ ఇంజనీర్ కాలిన్ బెన్నెట్, కంపెనీ చీఫ్ ఆస్ట్రోనాట్ సలహాదారు బెత్ మోసెస్, శిరీష వెళ్తున్నారు. బృందంలో ఇద్దరు పైలట్లు కూడా ఉంటారు. ప్రస్తుతం వర్జిన్ గెలాక్టిక్ సంస్థలో ప్రభుత్వ వ్యవహారాల ఉపాధ్యక్షురాలిగా విధులు నిర్వహిస్తున్న శిరీష.. ఈ ప్రయోగానికి అన్నీతానై వ్యవహరించినట్టు సంస్థ పేర్కొంది.
తెలుగు మూలాలున్న ఓ మహిళ అంతరిక్ష యాత్ర చేయడం ఇదే తొలిసారి. గతంలో భారత్కు చెందిన కల్పనా చావ్లా, భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ అంతరక్షింలోకి వెళ్లారు. వర్జిన్ గెలాక్టిక్ సంస్థ మానవ సహిత అంతరిక్ష యాత్ర నిర్వహించడం ఇదే తొలిసారి. గతంలో మూడు సార్లు మనుషుల్లేకుండా ప్రయోగాలు నిర్వహించింది. అంతరిక్షంలోకి ప్రయాణికులను తీసుకెళ్లేందుకు ఈ కంపెనీకి జూన్ 25న ఫెడరల్ ఏవియేషన్ ఆడ్మిన్మిస్ట్రేషన్ లైసెన్సు జారీ చేసింది. 2015 నుంచి శిరీష ఈ కంపెనీలో వివిధ హోదాల్లో పని చేస్తున్నారు. ఇటీవల 747 విమాన వాహకనౌక ద్వారా ప్రవేశపెట్టిన ఉపగ్రహం రూపకల్పనలోను ఆమె ప్రముఖ పాత్ర పోషించారు. అదేవిధంగా అడ్వాన్స్డ్ ఎయిర్క్రాఫ్ట్ ఎల్`3 కమ్యూనికేషన్స్ ఇంజనీర్గా పనిచేశారు. కాగా అంతరిక్షయానం చేయాలన్న తన చిన్ననాటి కల నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉందని శిరీష పేర్కొన్నారు.
శిరీష ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో జన్మించారు. హ్యూస్టన్, టెక్సాస్లో పెరిగారు. అంతరిక్షంపై ఆసక్తితో పర్డ్యూ వర్సిటీ నుంచి ఏరోనాటికల్ ఆస్ట్రోనాటికల్ ఇంజినీరింగ్లో డిగ్రీ చేశారు. వాషింగ్టన్ వర్సిటీ నుంచి ఎంబీఏ చేశారు. ప్రస్తుతం ఆమె వర్జిన్ గెలాక్టిక్ సంస్థ ప్రభుత్వ వ్యవహారాల విభాగం ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. తెలుగు అసోసియేషణ్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా)శిరీషకు శుభాకాంక్షలు తెలిపింది.