TTD: వైకుంఠం క్యూ కాంప్లెక్స్-3 నిర్మాణంపై కమిటీ.. టీటీడీ పాలక మండలి భేటి

తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండలి మంగళవారం జులై22 సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పాలక మండలిలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు టీటీడీ (TTD) ఈవో శ్యామలరావు వెల్లడించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -3 నిర్మాణంపై చర్చించామని… కమిటీ నివేదిక మేరకు ఈ నిర్మాణంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. సామాన్య భక్తులకు అదనంగా వసతి సదుపాయలు కల్పించాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు. అలిపిరి వద్ద మౌలిక సదుపాయాల కల్పనకు ఓ కమిటీని నియమించనున్నట్లు ప్రకటించారు. తిరుమల (Tirumala) లో పరిపాలన భవనాన్ని నిర్మించాలని టిటిడి పాలకమండలి సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. పాత భవనాలని తొలగించి వాటి స్థానంలో నూతన భవన నిర్మాణాాలు చేపట్టాలనే ప్రతిపాదనను బోర్డు ఆమోదించింది.
ఒంటిమిట్ట ఆలయంలో త్వరలోనే అన్నదానం ప్రారంభించనున్నారు. రూ. 4.7 కోట్లతో అన్నదానం కోసం నూతన భవన నిర్మాణానికి నిధులు కేటాయించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు టీటీడీ పాలక మండలి సభ్యులు. 320 ఆలయాలకు మైక్ సెట్లు ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 700 మంది వేద పారాయణదారుల నియామకానికి ఆమోదం తెలిపారు. ఇందుకోసం రూ.18కోట్ల నిధులు కేటాయించనున్నారు. 600 మంది వేద పారాయణదారులకు నిరుద్యోగ భృతి ఇవ్వడానికి ఆమోదించారు. శ్రీవాణి ట్రస్టు ద్వారా ఏపీలోని పలు దేవాలయాల వద్ద భజన మండలాల నిర్మాణానికి ఆమోదం తెలిపినట్లు టీటీడీ ఈవో శ్యామలరావు పేర్కొన్నారు.శిలాతోరణం, చక్రతీర్ధం అభివృద్ధి చేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఆలయాల నిర్మాణ అధ్యాయనానికి ఓ కమిటీ వేయనున్నట్లు వివరించారు. శ్రీవారి సేవను విశ్వవ్యాప్తం చేసే విధంగా కో ఆర్డినేటర్ల నియామకానికి ఆమోదం తెలిపారు. సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ ఏర్పాటుకు ఆమోదించారు. కల్యాణకట్టల వద్ద పారిశుద్ధ్యం పెంపునకు కూడా ఆమోద ముద్ర వేశారు.