TTD: టీటీడీలో సంచలన మార్పులకు రంగం సిద్దం..?

ఏపీ(Andhrapradesh)లో ప్రభుత్వం మారిన తర్వాత తిరుమల(Tirumala) తిరుపతి దేవస్థానంలో ప్రక్షాళన చర్యలకు దిగుతోంది. ఈ క్రమంలో ఉద్యోగులపై కూడా సీరియస్ గా ఫోకస్ చేసింది టీటీడీ పాలక మండలి. ముఖ్యంగా అన్యమత ఉద్యోగస్తులు ఎక్కువగా ఉన్నారని ఆరోపణలు రావడంతో, వారిని తొలగించే దిశగా చర్యలు చేపట్టింది. టీటీడీలో పనిచేస్తున్న నలుగురు అన్యమత ఉద్యోగులను సస్పెండ్ చేసింది తాజాగా. పెద్ద ఎత్తున టీటీడీ దేవస్తానాల్లో వారు విధులు నిర్వహిస్తున్నారని టీటీడీ ఇటీవల గుర్తించినట్టు వార్తలు వస్తున్నాయి.
తాజాగా టీటీడీలో పనిచేస్తున్న శ్రీ బి.ఎలిజర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ( క్వాలిటీ కంట్రోల్), శ్రీమతి ఎస్. రోసి, స్టాప్ నర్స్, బర్డ్ ఆసుపత్రి, శ్రీమతి ఎం.ప్రేమావతి, గ్రేడ్ -1 ఫార్మసిస్ట్ , బర్డ్ ఆసుపత్రి, అదేవిధంగా డా.జి.అసుంత. ఎస్వీ ఆయుర్వేద ఫార్మసీ లలో విధులు నిర్వహిస్తున్న ఈ నలుగురు ఉద్యోగులను టిటిడి సస్పెండ్ చేసినట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది. సదరు నలుగురు ఉద్యోగులు క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తున్నారని, అందుకు సంబంధించిన ఆధారాలు ,వచ్చిన ఆరోపణల నేపథ్యంలో వారిని సస్పెండ్ చేయడం జరిగిందని తెలిపింది.
సదరు ఆరోపణల నేపథ్యంలో టీటీడీ ఉద్యోగులు పనిచేస్తూ సంస్థ ప్రవర్తనా నియమావళిని పాటించలేదని భావించడమేకాక, హిందూ ధార్మిక సంస్థకు ప్రాతినిధ్యం వహించే ఉద్యోగులుగా విధులు నిర్వర్తిస్తూ భాద్యతా రహితంగా వ్యవహరించడం జరిగిందని పేర్కొంది. ఈ క్రమంలో టీటీడీ విజిలెన్స్ విభాగం సమర్పించిన నివేదికను, ఇతర ఆధారాలను పరిశీలించిన అనంతరం నిబంధనల ప్రకారం వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో సదరు నలుగురు ఉద్యోగులను తక్షణమే సస్పెండ్ చేయడం జరిగిందని వివరించింది.
త్వరలోనే మరికొందరు ఉద్యోగులను సస్పెండ్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. కీలక విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగులపై వేటుకు రంగం సిద్దమైనట్లు తిరుమల వర్గాలు అంటున్నాయి. గత ప్రభుత్వంలో అన్యమతస్థులు ఎక్కువగా టీటీడీలో జాయిన్ అయ్యారని హిందుత్వ సంస్థలు ఆరోపణ. ఇక టీటీడీని భ్రష్టు పట్టించేలా కొందరు అధికారులు వ్యవహరిస్తున్నారు అంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. దీనితో దాదాపు 21 మంది ఉద్యోగులను సస్పెండ్ చేసేందుకు సిద్దమైనట్లు వార్తలు వస్తున్నాయి.