TTD: స్పెషల్ దర్శనాలు రద్దు.. టీటీడీ కీలక ప్రకటన

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక నిర్ణయం తీసుకుంది. పది రోజుల పాటు స్పెషల్ దర్శనాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ప్రకటించారు. అన్నమయ్య భవన్ లో మీడియాతో మాట్లాడిన బీఆర్ నాయుడు (BR Naidu) కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రపంచ వ్యాప్తంగా హిందువులు వైకుంఠ ద్వార దర్శనం గూర్చి మాట్లాడుతున్నారని.. పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ అని ఏర్పాట్లు చేసిందని పేర్కొన్నారు. 10 తేదీన ఉదయం 4:30 గంటలకు ప్రోటోకాల్ దర్శనాలు ప్రారంభమవుతాయని తెలిపారు.
వైకుంఠ ఏకాదశి రోజు ఉ 8 గంటలకు సర్వదర్శనం ప్రారంభమవుతుందన్న ఆయన.. టికెట్లు, టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే దర్శనాలకు అనుమతి ఉంటుందని ప్రకటించారు. 10 తేదీన ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు స్వర్ణ రథం ఉంటుందని.. ఇక అన్ని ప్రత్యేక దర్శనాలను పది రోజులు రద్దు చేసినట్టు తెలిపారు. అదే విధంగా టికెట్లు లేని భక్తులు తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకూడదని సూచించారు. సామాన్య భక్తులకు ఎక్కువ సంఖ్యలో దర్శనాలను కల్పించేందుకు సిఫార్సు లేఖల దర్శనం రద్దు చేసినట్టు తెలిపారు.
వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తామన్నారు. సీఎం అదేశాల ప్రకారం సామాన్యభక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ఇక మైసూరు నుంచి వచ్చిన నిపుణులతో చేసిన పుష్పాలంకరణలు ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్న ఆయన.. 3 వేల సిసి కెమరాలతో నిఘా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. గోవిందమాల భక్తులకు ప్రత్యేకంగా ఎలాంటి ఏర్పాట్లు ఉండదన్నారు. అందరు భక్తులతో కలిసి SSD టోకన్లు తీసుకొని వైకుంఠద్వార దర్శనాలకు రావాలని సూచించారు. టోకెన్ లు టిక్కెట్లు లేని భక్తులను తిరుమలకు అనుమతించరని…కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. కొత్త వైరస్ నేపధ్యంలో భక్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.