Nara Lokesh: కర్ణాటకలోని శ్రీ ఆదిచుంచనగిరి క్షేత్రాన్ని సందర్శించిన మంత్రి లోకేష్

కర్ణాటక: కర్ణాటక రాష్ట్రం మాండ్య జిల్లా నాగమంగల తాలూకాలోని ప్రముఖ సామాజిక- ఆధ్యాత్మిక కేంద్రం శ్రీ ఆదిచుంచనగిరి మహాసంస్థాన మఠాన్ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) సందర్శించారు. 18 వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ మఠం జ్ఞానానికి, భక్తికి, సేవకు చిహ్నం. ఈ సందర్భంగా క్షేత్రంలోని శ్రీ కాలభైరవేశ్వర స్వామివారిని దర్శించుకుని మంత్రి నారా లోకేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ ఆదిచుంచనగిరి మహాసంస్థాన మఠం చేపడుతున్న వివిధ సేవా, ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. మఠం 72వ పీఠాధిపతి జగద్గురు శ్రీ నిర్మలానందనాథ మహాస్వామిజీ ఆశీర్వాదం పొందారు. మఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలలు, మెడికల్ కాలేజ్, హాస్పిటల్, యూనివర్సిటీ ను మంత్రి నారా లోకేష్ సందర్శించారు.
అనంతరం మఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంవిత్ పాఠశాలల గురించి ప్రత్యేకంగా అడిగితెలుసుకున్నారు. పేద విద్యార్థులకు ఎటువంటి ఖర్చు లేకుండా 6 వ తరగతి నుండి ఇంటర్ వరకూ అన్ని వసతులతో కూడిన విద్యను అందిస్తున్నాం అని మఠం నిర్వాహకులు తెలిపారు. అంతే కాకుండా ఇంటర్ పూర్తయిన తరువాత ఏ రాష్ట్రంలో డిగ్రీ చదవాలి అనుకున్నా మఠం ఆర్ధిక సహాయం అందిస్తుంది అని తెలిపారు. ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ లో పేద విద్యార్థులకు ఉపయోగపడేలా సంవిత్ పాఠశాల ప్రారంభించాలని మంత్రి నారా లోకేష్ కోరగా పీఠాధిపతి జగద్గురు శ్రీ నిర్మలానందనాథ మహాస్వామిజీ అందుకు అంగీకరించారు.