Jagga Reddy: రాహుల్ పై ఆయన మాట్లాడటం ఆపకుంటే ..నేను కేసీఆర్ గురించి మాట్లాడాల్సి వస్తది
రాహుల్గాంధీ తెలంగాణ ఇస్తేనే, కేటీఆర్ కంటూ ఒక పొలిటికల్ పర్సనాలిటీ వచ్చిందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి (Jagga Reddy) అన్నారు. గాంధీభవన్లో మీడియా సమావేశంలో జగ్గారెడ్డి (Rahul Gandhi) మాట్లాడుతూ రాహుల్ను విమర్శించే పర్సనాలిటీ కేటీఆర్ది కాదన్నారు. కేటీఆర్కు (KTR) ఏమాత్రం రాజకీయ విలువలు ఉన్నా, రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసీ తెలంగాణ ఇచ్చిన రాహుల్గాంధీకి విజన్ లేదంటూ విమర్శిస్తూ తప్పుగా మాట్లాడొద్దని పేర్కొన్నారు. రాహుల్ గాంధీపైన ఆయన మాట్లాడటం ఆపకుంటే, తాను కేసీఆర్ గురించి అనేక విషయాలు బయట చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. కేటీఆర్ తన వయసుకు మించిన మాటలు మాట్లాడుతున్నాడన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు తాను రాహుల్ను కలిశానని, రాష్ట్రాన్ని విభజిస్తే కాంగ్రెస్ రాజకీయంగా నష్టపోతుందని చెప్పానని వెల్లడించారు. సీమాంధ్ర ప్రాంతంలో పార్టీ అవుట్ అయిపోతుంనీ చెప్పానన్నారు. తెలంగాణ ఇస్తే ఇక్కడ పూలు కురిపిస్తారే కానీ, కాంగ్రెస్కు అధికారంమాత్రం ఇవ్వరనీ చెప్పానని వివరించారు. దానికి రాహుల్ స్పందిస్తూ తాము రాజకీయంగా ఆలోచన చేయట్లేదని, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం వారి చిరకాల వాంఛ నెరవేర్చాలన్న నిర్ణయానికి తాను, అమ్మ సోనియాగాంధీ వచ్చినట్లు తెలిపారని పేర్కొన్నారు.






