2,90,396 కోట్లతో తెలంగాణ బడ్జెట్… కేటాయింపులిలా
ప్రగతిశీల రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి చెందుతోందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. శాసనసభలో రాష్ట్ర బడ్జెట్ ను మంత్రి ప్రవేశపెట్టారు. రూ.2,90,396 కోట్లతో పద్దును సభ ముందుకు తీసుకొచ్చారు. రెవెన్యూ వ్యయం రూ.2,11,685 కోట్లు, మూలధనం వ్యయం రూ.37,525 కోట్లుగా పేర్కొన్నారు. వ్యవసాయ రంగానికి రూ.26,831 కోట్లు, నీటిపారుదల రంగానికి 26,885 కోట్లు కేటాయించారు. కీలకమైన దళితబంధు పథకానికి రూ.17,700 కోట్లు, డబుల్ బెడ్రూం ఇళ్లకు రూ.12 వేల కోట్లు కేటాయింపులు జరిపారు. కేంద్ర ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తున్నా అభివృద్ధిలో ముందుకు సాగుతున్నామని మంత్రి హరీశ్ తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగులకు శుభవార్త చెప్పారు. ఏప్రిల్ నుంచి కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామని బడ్జెట్ ప్రసంగంలో మంత్రి పేర్కొన్నారు.
కేటాయింపులిలా : నీటి పారుదల రంగం రూ.26,885 కోట్లు, వ్యవసాయ రంగం రూ.26,831, విద్యుత్ రంగం రూ.12.727 కోట్లు, ప్రజా పంపిణీ వ్యవస్థకు రూ.3,117 కోట్లు, ఆసరా పింఛన్లకు రూ.12,000 కోట్లు, దళితబంధుకు రూ.17,700 కోట్లు, గిరిజన సంక్షేమం, షెడ్యూల్ తెగల ప్రత్యేక ప్రగతినిధికి రూ.15,233 కోట్లు, బీసీ సంక్షేమానికి రూ.6,229 కోట్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబాకర్ రూ.3,210 కోట్లు, మహిళా శిశు సంక్షేమానికి రూ.2,131 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి రూ.2,200 కోట్లు, హరితహారానికి రూ.1,471 కోట్లు, విద్యారంగానికి రూ.19.093 కోట్లు, వైద్య, ఆరోగ్యరంగానికి రూ.12,161 కోట్లు, పల్లె ప్రగతి, పంచాయతీరాజ్ శాఖకు రూ.31,426 కోట్లు, పురపాలక శాఖకు రూ.11,372 కోట్లు, రోడ్లు భవనాలకు రూ.2,500 కోట్లు, పరిశ్రల శాఖకు రూ.4,037 కోట్లు, హోం శాఖకు రూ.9,599 కోట్లు, కేసీఆర్ కిట్ కోసం రూ.200 కోట్లు, కొత్తగా నియమించే ఉద్యోగుల జీతభత్యాలకు రూ.1000 కోట్లు కేటాయించడం జరిగింది.






