Supreme Court: సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురు

తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు జీవోపై సుప్రీంకోర్టు (Supreme Court) లో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. అత్యున్నత న్యాయస్థానం పిటిషన్ను డిస్మిస్ (Dismiss) చేసింది. రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల (BC Reservations) అమలు జీవోపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వీ (Abhishek Singhvi) వాదనలు వినిపించారు. ఈ అంశంపై తక్షణమే జోక్యం చేసుకోవాలని న్యాయస్థానాన్ని కోరారు. రిజర్వేషన్లు 50శాతం మించొద్దనే అభిప్రాయం సరికాదని కోర్టుకు వివరించారు. ఇందిరా సహానీ కేసులోనూ 50శాతం పరమితి దాటొచ్చని ఉందని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా జరగని విధంగా తెలంగాణలో కులగణన సర్వే జరిగిందని అన్నారు. ప్రభుత్వం ఇంటింటి సర్వే చేసి లెక్క తేల్చిందని అభిషేక్ సింఘ్వీ న్యాయస్థానానికి వివరించారు. రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీలో అన్ని పార్టీలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయని, 3 నెలలు దాటినా బిల్లుపై గవర్నర్ నిర్ణయం తీసుకోలేదని వాదించారు. 3 నెలల్లో నిర్ణయం తీసుకోకపోతే బిల్లు ఆమోదం పొందినట్టేనని సుప్రీం చెప్పిందని, సుప్రీం తీర్పు ప్రకారం బిల్లు చట్టంగా మారినట్టేనని వాదనలు బలంగా వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం పిటిషన్ ను డిస్మిస్ చేసింది.