“Life of a Karma Yogi” పుస్తకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

“Life of a Karma Yogi”పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) గారి స్పీచ్ స్క్రోలింగ్ పాయింట్స్..
గోపాలకృష్ణ గారి అనుభవాలను ఈ పుస్తకంలో నిక్షిప్తం చేయడం సంతోషం. ఆరు దశాబ్దాల తన అనుభవాన్ని నిక్షిప్తం చేయడం పెద్ద టాస్క్. ఏదైనా కొనవచ్చు కానీ ఎక్స్పీరియన్స్ ను కొనలేం. సివిల్ సర్వెంట్స్ అందరికీ ఈ పుస్తకం ఒక దిక్సూచిగా ఉంటుందని భావిస్తున్నా. ఆనాటి నుంచి ఈనాటి వరకు దేశంలో వేగంగా జరిగిన మార్పులకు ఆయన ప్రత్యక్ష సాక్షి. ఈసందర్భంగా ముగ్గురు వ్యక్తులను మనం గుర్తు చేసుకోవాలి శంకరన్, శేషన్, మన్మోహన్ సింగ్. నిబద్ధతతో పనిచేసిన గొప్ప అధికారి శంకరన్. పారదర్శక ఎన్నికల నిర్వహణకు ఎంతో కృషి చేసిన గొప్ప వ్యక్తి శేషన్ గారు.
దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి పథంలో నడిపిన వ్యక్తి మన్మోహన్ సింగ్. వారి అనుభవాల నుంచి సివిల్ సర్వెంట్స్ ఎంతో నేర్చుకోవాల్సి ఉంది. గతంలో అధికారులు రాజకీయ నాయకులు అంశాలను ప్రస్తావిస్తే అందులోని లోతుపాతులు, లాభ నష్టాలను వివరించేవారు. కానీ ఈ రోజుల్లో ఎందుకో అది తగ్గిపోయింది. రాజకీయ నిర్ణయాలపై నాయకులకు అధికారులు విశ్లేషణ చేసి చెప్పాలి.
గతంలో ఐఏఎస్ అధికారులు నిత్యం ప్రజల్లో ఉండేవారు. రాజకీయ నాయకుల కంటే ప్రజలు అధికారులను ఎక్కువ గుర్తుంచుకునేవారు. కానీ ఇప్పుడు కలెక్టర్లు ఏసీ రూముల్లోంచే బయటకు వెళ్లడం లేదు. అధికారుల ఆలోచనలో, విధానంలో మార్పు రావాలి. నిబద్ధత కలిగిన అధికారులకు తప్పకుండా గుర్తింపు ఉంటుంది. పేదలకు సాయం చేయాలన్న ఆలోచన అధికారులకు ఉండాలి. అలాంటి వారే ప్రజల మనసులో ఎక్కువకాలం గుర్తుంటారు. ఆ దిశగా రాష్ట్రంలో అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నా.