కబ్జాదారుల గుండెల్లో మరో బాంబ్ పేల్చిన రేవంత్ సర్కార్…

ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అన్న సినిమా డైలాగ్.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విషయంలో అక్షరాలా రుజువవుతున్నట్లు కనిపిస్తోంది. ప్రముఖుల నుంచి కట్టడాల కూల్చివేత వద్దంటూ విపరీతంగా వత్తిడి వస్తున్నా.. ఆయన ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఆక్రమణల నుంచి హైదరాబాద్ నగరాన్ని రక్షించుకోవాలన్న దృఢ నిశ్చయాన్ని అలాగే కొనసాగిస్తున్నారు. మరిన్ని ఆక్రమణలను కూల్చేయాలని ఆదేశాలిచ్చేశారు.
ఫలితంగా ఆక్రమణలపై మరోసారి బుల్డోజర్ ప్రయోగానికి సిద్ధమైంది హైడ్రా..శేరిలింగంపల్లి మండల పరిధిలోని 5 చెరువుల పరిధిలోని ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లోని నిర్మాణాలకు నోటీసులు జారీ చేసింది.5 చెరువుల పరిధిలో 204 నిర్మాణ యజమానులకు నోటీసులు చేరవేసింది. దుర్గం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో నెక్టర్స్ కాలనీ, డాక్టర్స్ కాలనీ,కావూరి హిల్స్, అమర్ సొసైటీ వాసులకు 77 నోటీసులు అందజేసింది. పలు ఇళ్లకు నోటీసులను సైతం శేరిలింగంపల్లి రెవెన్యూ సిబ్బంది అంటించారు.
నెల రోజుల గడువు ఇస్తూ ఎఫ్టీఎల్ను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను స్వచ్ఛందంగా కూల్చివేయాలని నోటీసుల్లో అధికారులు స్పష్టం చేశారు. దుర్గం చెరువులో ఒక్కరోజే నాలుగు కాలనీల్లోని వందల ఇళ్లు, వాణిజ్యసముదాయాలకు రేవంత్ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. వాల్టా చట్టంలోనిసెక్షన్ 23(1) కింద నోటీసులు జారీ చేయడం జరిగింది. యజమానులు కూల్చుకుంటే ఓకే.. లేని పక్షంలో తామే కూల్చివేతలు చేపట్టాల్సి ఉంటుందని నోటీసుల్లోహెచ్చరికలు జారీ చేసింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్.. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తర్వాత పెద్దగా బయటకు వచ్చింది లేదు. కార్యాలయంలోనే ఉంటూ అధికారులతో సమావేశాల మీద సమావేశాలు నిర్వహిస్తున్నట్టుగా వార్తలొచ్చాయి.అందరూ అనుకున్నట్టే జరిగింది. మరో బాంబ్ పేల్చేందుకు కాస్త సమయం తీసుకుంటున్నారని అంతా భావించారు. చివరకు అదే జరిగింది.
మొత్తానికి హైడ్రా పెద్ద బాంబే పేల్చింది. స్వయానా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఉంటున్న ఇంటికి నోటీసులను అంటించి షాక్ ఇచ్చారు హైడ్రా సిబ్బంది. దీంతో తప్పు చేస్తే సోదరుడైనా వదిలేది లేదని రేవంత్ తేల్చి చెప్పినట్లైంది. మాదాపూర్ అమర్ కో-ఆపరేటివ్ సొసైటీలో తిరుపతి రెడ్డి ఉంటున్న అద్దె ఇల్లు,కార్యాలయం దుర్గంచెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్లు రెవెన్యూ అధికారులు ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు.