Seethakka: కేంద్రం నుంచి మరింత ఆర్థిక సాయం కావాలి: సీతక్క

తెలంగాణలో గ్రామీణాభివృద్ధి పథకాల అమలు సజావుగా సాగుతోందని, కేంద్రం నుంచి మరింత ఆర్థిక సహాయం అవసరమని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క (Seethakka) విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి అధ్యక్షతన గురువారం ఢిల్లీ నుంచి జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో ఆమె పాల్గొన్నారు. ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన కింద కేంద్రం కేటాయించిన రూ.368.7 కోట్లలో రూ.129.64 కోట్లు (35%) ఖర్చు చేశామని, మిగిలిన నిధులను నవంబర్ నాటికి పూర్తిగా ఖర్చు చేస్తామని మంత్రి (Seethakka) తెలిపారు. దక్కన్ పీఠభూమి నేలల ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, ఈ పథకానికి అదనపు నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని సీతక్క కోరారు. ఆమె విజ్ఞప్తికి చౌహాన్ (Shivraj Singh Chouhan) సానుకూలంగా స్పందించారు. సెప్టెంబర్ 4, 5 తేదీల్లో రాజస్థాన్లోని ఉదయపూర్లో జరగనున్న గ్రామీణాభివృద్ధి మంత్రుల సమావేశంలో తెలంగాణ అవసరాలపై ప్రజెంటేషన్ ఇవ్వాలని సూచించారు. తెలంగాణలో అమలవుతున్న వినూత్న పథకాలను ప్రదర్శించాలని కోరారు. అలాగే, గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారతకు కేంద్రం నుంచి పూర్తి సహకారం అందిస్తామని చౌహాన్ హామీ ఇచ్చారు. ఈ హామీకి మంత్రి సీతక్క (Seethakka) కృతజ్ఞతలు తెలిపారు.