ఈ రంగంలో పెట్టుబడులు పెట్టే… పారిశ్రామికవేత్తలకు రాయితీలు : మంత్రి కేటీఆర్
తెలంగాణలో వంట నూనెల పరిశ్రమలకు అనువైన వాతావరణం ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు హైదరాబాద్ మాదాపూర్లో జరుగుతున్న వెజ్ అయిల్, ఆయిల్ సీడ్ రంగంపై గ్లోబల్ రౌండ్ టేబుల్ సదస్సుకు మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నామని, అవసరమైన రాయితీలు కల్పిస్తామని తెలిపారు. తెలంగాణలో 20 లక్షల ఎకరాల్లో పామాయిల్ సాగు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. పలు ప్రాంతాల్లో ఇప్పటికే పామాయిల్ సాగు ప్రారంభమైందన్నారు. ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్ లాంటి జిల్లాలో సోయాబిన్, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వేరు శనగ, ఇతర జల్లాల్లో పొద్దు తిరుగుడు పంటను పండిస్తున్నారని తెలిపారు.
తెలంగాణలో ఆయిల్ పరిశ్రమకు అవసరమైన ముడి సరుకు అందుబాటులో ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు. నూనె ఉత్పత్తుల పంటల సాగును ప్రోత్సహించడం ద్వారా అయిల్ దిగుమతులను తగ్గించుకోవచ్చని సూచించారు. దేశీయ అవసరాల్లో 60 శాతం ఆయిల్ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామన్నారు. దీనిని గణనీయంగా తగ్గించుకోవచ్చన్నారు. తెలంగాణలో 10 వేల ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.






