హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ భారీ పెట్టుబడులు?
హైదరాబాద్ ఫ్యూచర్ టెక్నాలజీలకు అనుగుణంగా సిద్ధమవుతోంది. దీంతో ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు భారీ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. క్లౌడ్ కంప్యూటింగ్, డేటా స్టోరేజీ, స్పేస్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ రంగాలకు మంచి భవిష్యత్తు ఉన్న నేపథ్యంలో తెలంగాణ సర్కారు తీసుకువచ్చిన డేటా సెంటర్ పాలసీ అందరినీ ఆకర్షిస్తోంది. దీంతో ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు మైక్రోసాఫ్ట్ రెడీ అయినట్టు సమాచారం. తెలంగాణలో డేటా సెంటర్ ఏర్పాటు చేయాల్సిందిగా ఇప్పటికే మైక్రోసాఫ్ట్కి తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం పంపింది. ఈ మేరకు మైక్రోసాఫ్ట్, తెలంగాణ సర్కార్ల మధ్య పలు దఫాలుగా చర్చలు జరిగాయి. కాగా హైదరాబాద్లో డేటా సెంటర్ ఏర్పాటుకు 50 ఎకరాల స్థలం అవసరం కానుంది. కొత్తగా నెలకొల్పబోయే డేటా సెంటర్ కోసం రూ.15 వేల కోట్ల రూపాయలను మైక్రోసాఫ్ట్ కేటాయించనున్నట్టు సమాచారం. మరో నెల రోజుల్లో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుందని వార్త.






