Revanth Reddy :గత పదేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా? … నేను సిద్ధం

గత పాలకులు పాలమూరు జిల్లాను పట్టించుకోలేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆవేదన వ్యక్తం చేశారు. నారాయణపేట (Narayanpet)లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పదేళ్ల పాటు ఏ గ్రామంలో పేదలకు ప్రభుత్వ ఇళ్లు దక్కలేదు. ఇప్పుడు ప్రజా ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను కేటాయించింది. పదేళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదు. అంతకు ముందు ఎంపీగా గెలిపిస్తే, ఏనాడు పాలమూరు గురించి పార్లమెంట్లో ప్రస్తావించలేదు. తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా ఈ జిల్లాకు న్యాయం జరగలేదు. గతంలో కొందరు సీఎంలు పాలమూరు పేరు చెప్పి రాజకీయం చేశారు కానీ, జిల్లాకు చేసిందేమీ లేదు. భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగర్, సంగంబండం, కల్వకుర్తి ప్రాజెక్టుల పదేళ్లలో ఎందుకు పూర్తి చేయలేదు. పదేళ్లలో పాలమూరు` రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసి ఉంటే ఇవాళ చంద్రబాబుతో పంచాయితీ ఉండేది కాదు. వైఎస్ఆర్, జగన్ పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా నీళ్లు రాయలసీమకు తరలించుకుపోతుంటే కేసీఆర్ నోరెత్తలేదు. నా మీద పగతో మక్తల్` నారాయణపేట`కొండగల్ ప్రాజెక్టును పక్కన పడేశారు అని అన్నారు.
ప్రజా పాలన సరిగా లేదని విమర్శలు చేస్తున్నారు. పదేళ్లు కేసీఆర్ (KCR) ముఖ్యమంత్రిగా ఉన్నారు, 12 ఏళ్లు నుంచి మోదీ (Modi) ప్రధాని ఉన్నారు, 12 నెలలుగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అధికారంలో ఉంది. ప్రతిపక్ష నేతగా కేసీఆర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి చర్చకు వస్తే ముఖ్యమంత్రిగా నేను సిద్ధం. గత పదేళ్ల పాలనపై చర్చిద్దాం. చర్చలో ఓడితే ముక్కు నేలకు రాస్తా. పదేళ్లలో ఏమీ చేయని వాళ్లు ఏడాదిలోనే కాంగ్రెస్ ఏమీ చేయలేదని అంటున్నారు. పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు, పరిశ్రమలను అడ్డుకోవాలని కుట్రలు చేస్తున్నారు. మోసగాళ్ల మాటలు విని భూసేకరణను అడ్డుకోవద్దు. భూమి కోల్పోయిన వారికి మంచి పరిహారం ఇచ్చి న్యాయం చేసే బాధ్యత నాది అని అన్నారు.