కేసీఆర్ పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం : రేవంత్

కేసీఆర్ పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం జరిగిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఏప్రిల్ 6న నిర్వహించనున్న జనజాతర సభ ఏర్పాట్లను మంత్రులు, పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు. అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడుతూ లోక్సభ ఎన్నికలకు తుక్కుగూడ వేదిక నుంచే కాంగ్రెస్ పార్టీ జాతీయస్థాయి మేనిఫెస్టో విడుదల చేస్తుందని తెలిపారు. కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక తెలంగాణకు ఇవ్వనున్న ప్రత్యేక నిధులు, అనుమతులను అందులో పొందుపరుస్తామని తెలిపారు. కోలుకోని విధంగా బీఆర్ఎస్ నేతలు ఆర్థిక, సహజ వనరులను దోచుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పాలనతో రాష్ట్రంలో కరవు వచ్చిందంటూ ఇటీవల కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. 80 వేల పుస్తకాలు చదివిన ఆయనకు వర్షాకాలం, చలికాలం ఎప్పుడొస్తుందో కూడా తెలియదా? అని ఎద్దేవా చేశారు. కేసీఆర్కు పదేళ్ల తర్వాతైనా రైతులు, వ్యవసాయం గుర్తొచ్చినందుకు, ఇప్పటికైనా పొలం బాట పట్టినందుకు సంతోషమని వ్యాఖ్యానించారు.