Revanth reddy : మెదక్ చర్చికి దేశస్థాయిలో గుర్తింపు : సీఎం రేవంత్

వందేళ్లు పూర్తిచేసుకున్న మెదక్ (Medak )చర్చికి దేశస్థాయిలో గుర్తింపు ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(revanth reddy) అన్నారు. క్రిస్మస్ సందర్భంగా మెదక్ చర్చిలో నిర్వహించిన వేడుకల్లో సీఎం పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్(Mynampally Rohit) , మాజీ ఎమ్మెల్యే హన్మంతరావు(Hanmantha Rao) విజ్ఞప్తి మేరకు మెదక్ చర్చి అభివృద్ధికి నిధులు కేటాయించామని తెలిపారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చానని, సీఎం హోదాలో మళ్లీ వస్తానని అప్పట్లో మాటిచ్చానని రేవంత్ రెడ్డి గుర్తు చేసుకొన్నారు. క్రిస్మస్ సందర్భంగా అందరినీ కలుసుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయనున్న ఇందిరమ్మ ఇళ్లలో దళిత, గిరిజన క్రైస్తవులకు అత్యధికంగా లబ్ధి చేకూరుతుందన్నారు. ఆరోగ్యశ్రీ సాయాన్ని రూ.10 లక్షలకు పెంచామని, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు. రైతులకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశామని తెలిపారు.