ఒత్తిళ్లు వస్తున్నాయి అయినా… వెనక్కి తగ్గేదేలే : సీఎం రేవంత్

ఎఫ్టీఎల్, బఫర్జోన్లో ఎవరు నిర్మాణాలు చేసినా కూల్చివేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సచివాలయంలో రేవంత్ మీడియాతో మాట్లాడుతూ సీడబ్ల్యూసీ సభ్యుడు పల్లంరాజు నిర్మాణాన్నే హైడ్రా మొదట కూల్చివేసింది. జన్వాడ ఫామ్హౌస్ లీజుకు తీసుకున్నట్లు అఫిడవిట్లో కేటీఆర్ ఎందుకు ప్రస్తావించలేదు. నిర్మాణాలకు అధికారులే అనుమతి ఇస్తారు. సర్పంచ్లు కాదని పదేళ్లు మంత్రిగా పనిచేసిన ఆయనకు తెలియదా? అని ప్రశ్నించారు. నా కుటుంబం కబ్జా చేసినట్లు కేటీఆర్ చూపిస్తే దగ్గరుండి కూల్చివేయిస్తా. విద్యా సంస్థల ముసుగులో కబ్జా చేస్తే ఊరుకోం. హైడ్రా హైదరాబాద్కు మాత్రమే ఇప్పటివరకు పరిమితం. ఎఫ్టీఎల్, బఫర్జోన్, చెరువులు, నాలాల ఆక్రమణల తొలగింపునకే మొదటి ప్రాధాన్యం. 30 ఏళ్ల కింద కట్టిన అక్రమ నివాస కట్టడాలైనా హైడ్రా చర్యలు తీసుకుంటుంది. బీఆర్ఎస్ నేత హరీశ్రావు సిద్దమైతే ఆయన నేతృత్వంలోనే చెరువుల ఆక్రమణలపై నిజ నిర్ధరణ కమిటీ వేస్తాం. హైడ్రా కూల్చివేతలపై ఒత్తిళ్లు వస్తున్నాయి. అయినా ఎదుర్కొంటాం. వెనక్కి తగ్గేది లేదు అని అన్నారు.